పార్లమెంట్ దృష్టికి భౌతిక దాడి.. ఛలో అసెంబ్లీ ఘటనపై లోక్సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ నోటీసు
Recommended Video
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్ వేదికగా తనపై జరిగిన భౌతిక దాడిపై నిప్పులు చెరిగారు. లోక్సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రివిలేజ్ మోషన్ నోటీసు ఇచ్చి తనపై జరిగిన దాడిని సభలో సభ్యులందరి ముందు కళ్ళకు కట్టినట్టు చెప్పారు.. రాష్ట్ర ప్రభుత్వం తనపై భౌతిక దాడికి పాల్పడిందని వెల్లడించారు. ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు నోటీసు గల్లా జయదేవ్ అందజేశారు. వైసీపీ ఎంపీల ముందే ఏపీలో ప్రభుత్వ అరాచక పాలనపై ఆయన పార్లమెంట్ వేదికగా మాట్లాడారు.

లోక్ సభ దృష్టికి ఎంపీ గల్లాపై భౌతిక దాడి వ్యవహారం
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు నిరసనగా జరిగిన ఛలో అసెంబ్లీ సందర్భంలో జరిగిన సంఘటనను లోక్ సభ దృష్టికి తీసుకువెళ్ళారు గల్లా జయదేవ్ . తనపై భౌతిక దాడి జరిగిందని దీనికి ఎపీలోని వైసీపీ ప్రభుత్వం కారణమని ఆరోపించారు. మీడియాలో వచ్చిన కథనాలను కూడా ఆధారాలుగా స్పీకర్కు సమర్పించారు. తన అరెస్ట్ను, పోలీసులు తనను ఇబ్బందులకు గురి చేసిన విధానాన్ని లోక్సభలో ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు.

13 గంటల పాటు ప్రతీ ఊరు తిప్పి వేధించారన్న గల్లా
రాజధాని అమరావతి రైతుల పక్షాన ప్రజా ప్రతినిధిగా వారి ఉద్యమానికి మద్దతు తెలపడం తన బాధ్యతని అందుకే చలో అసెంబ్లీకి వారికి మద్దతు తెలపడానికి వెళ్లానని చెప్పిన జయదేవ్ ఏపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించిందని చెప్పుకొచ్చారు. ఏపీలోని వైస్సార్సీపీ ప్రభుత్వం రైతులు నిర్వహించిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అడ్డుకుందని, శాంతియుతంగా ఆందోళన తెలియజేస్తున్నా పోలీసులే ఉద్రిక్త పరిస్థితులు క్రియేట్ చేశారని ఆరోపించారు. తనను అరెస్ట్ చేసిన పోలీసులు గాయపరిచారని, ఎక్కడ తిప్పుతున్నారో కూడా చెప్పకుండా తనను 13 గంటల పాటు ప్రతీ ఊరు తిప్పారని మండిపడ్డారు ఎంపీ గల్లా జయదేవ్.

చొక్కా చించి, భౌతిక దాడికి పాల్పడ్డారన్న ఎంపీ
ఛలో అసెంబ్లీ సందర్భంగా అసెంబ్లీ దగ్గరకు చేరుకోగానే ఇద్దరు ఎస్పీలు అకారణంగా లాఠీ చార్జ్ చేశారని ఆయన పేర్కొన్నారు. పోలీసుల తీరు చాలా దారుణంగా ఉందని ఆయన చెప్పారు. ఎంపీ అయిన తనపట్ల కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారని తన చొక్కా చించి వేశారని ఆయన చెప్పారు . అంతే కాదు తనపై అక్రమ కేసులు బనాయించారని ఆయన పేర్కొన్నారు. చొక్కా చింపి గాయపరిచి 13గంటల పాటు అనేక ప్రాంతాల్లో తిప్పారని జయదేవ్ పేర్కొన్నారు.

రాజధాని రైతుల పోరాటాన్ని సభలో మాట్లాడిన ఎంపీ గల్లా జయదేవ్
తన నియోజకవర్గ ప్రజల కోసం చలో అసెంబ్లీలో పాల్గొన్నానన్నారు. రాజధాని కోసం 49 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా...వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని గల్లా జయదేవ్ లోక్సభలో ప్రస్తావించారు. పోలీసులు తమ వాహనంలో గుంటూరు జిల్లా అంతా తిప్పారని ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా తిప్పారని పేర్కొన్నారు. కనీసం గాయాలకు వైద్య సహాయం కూడా అందించకుండా అమానుషంగా ప్రవర్తించారని ఆయన లోక్సభ దృష్టికి తీసుకువెళ్ళారు.












Click it and Unblock the Notifications