షాక్: చెవిరెడ్డిపై సభాహక్కుల నోటీసు, జగన్! నీ ఇంట్లో..
అనుభవలేమి: యనమల
విపక్ష సభ్యుల్లో అనుభవలేమి స్పష్టంగా కనిపిస్తోందని ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. సభలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు అనుసరిస్తున్న తీరు సరిగా లేదన్నారు. ప్రతి అంశం పైన పోడియం వద్దకు వచ్చి ఆందోళన చేస్తున్నారన్నారు. రూలింగ్ పార్టీకి మాట్లాడే అవకాశం కల్పించాలని కోరారు.
కాగా, అంతకుముందు సభ ప్రారంభమైన కాసేపటికే పదినిమిషాలు వాయిదా పడింది. తాగునీటి సమస్య పైన చర్చకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పట్టుబడటంతో సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో సభాపతి సభను పదినిమిషాలు వాయిదా వేశారు.
మండలిలో సవాళ్లు, ప్రతి సవాళ్లు
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఆసక్తికర అంశాలు చోటుచేసుకున్నాయి. అధికార, విపక్ష సభ్యుల సవాళ్లు, ప్రతి సవాళ్లతో శాసనమండలి హోరెత్తింది. రాష్ట్ర వార్షిక బడ్జెట్ పై చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ ఎస్వీ సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. రానున్న 50 లేదా 60 రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు, డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తారని మండలికి తెలిపారు. దీంతో విపక్ష సభ్యులు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు.
తాము రైతులం కాదని, వాస్తవాలు తమకు కూడా తెలుసని, రైతులను మభ్యపెట్టినట్టు తమను కూడా మభ్యపెట్టడం కుదరదన్నారు. దీంతో టీడీపీ నేతలు వేచి చూడండని సవాలు విసిరారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్ సభ్యుడు చెంగల్రాయుడు మాట్లాడుతూ... మాఫీ అంత సులువు కాదని, రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల్లోనే రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.
ఎక్కువ సమయం తీసుకుంది: దూళిపాళ్ల
కేటాయించిన సమయం కంటే ప్రతిపక్షం ఎక్కువ సమయం తీసుకుందని ప్రభుత్వ విప్ దూళిపాళ్ల నరేంద్ర అన్నారు. నిబంధనల ప్రకారం సమయం కేటాయించినా.. అదేదో తప్పుగా ప్రతిపక్షం గగ్గోలు చేస్తోందన్నారు. అధికార పార్టీకి కేటాయించిన సమయాన్ని హరించడం ప్రతిపక్షానికి తగదన్నారు.
స్పీకర్ పోడియం ముందు వైయస్సార్ కాంగ్రెస్
జగన్కు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. వారి నినాదాలతో సభలో గందరగోళం ఏర్పడింది. సభ సజావగా సాగేందుకు ప్రతిపక్ష సభ్యులు సహకరించాలని యనమల కోరారు. ప్రతిపక్ష నేత నా ఇష్టమనే తీరు ఇంట్లో చెల్లుతుందని, సభలో కాదన్నారు. ప్రతిపక్ష సభ్యుల తీరు మంచి సంప్రదాయం కాదన్నారు. కాగా, సభ మరో పదిహేను నిమిషాలు వాయిదా పడింది.