వన్సైడ్ లవ్: పవన్ కల్యాణ్ సినిమాలకు ఏపీ ప్రభుత్వం అడ్డంకి: రాజ్యసభలో టీడీపీ ఎంపీ కంప్లైట్
అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్తో వన్సైడ్ లవ్ కొనసాగుతోందంటూ తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తన కుప్పం నియోజకవర్గం పర్యటన సందర్భంగా చేసిన ప్రకటన.. అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, దీనికి పవన్ కల్యాణ్ అంగీకరించాల్సి ఉందనీ చెప్పుకొచ్చారు. దీన్ని వన్సైడ్ లవ్గా అభివర్ణించారాయన.
Recommended Video

రాజ్యసభ సాక్షిగా..
జనసేనతో తెలుగుదేశం పార్టీ నిజంగానే వన్సైడ్ లవ్ను కొనసాగిస్తోందనే విషయం మరోసారి రుజువైంది.. రాజ్యసభ సాక్షిగా. పెద్దల సభ వేదికగా పవన్ కల్యాణ్కు టీడీపీ అండగా నిలిచింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం- పవన్ కల్యాణ్ సినిమాలను ఉద్దేశపూరకంగా అడ్డుకుంటోందని ఫిర్యాదు చేసింది. ప్రత్యర్థులపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాజకీయంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది.

డ్రగ్స్, క్యాసినో..
రాజ్యసభలో- రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలను తెలిపే తీర్మానంపై తెలుగుదేశం పార్టీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ప్రసంగించారు. ఏపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఏపీలో డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతోందని విమర్శించారు. క్యాసినోలను కూడా ప్రభుత్వం తెరమీదికి తీసుకొచ్చిందని అన్నారు. సంక్రాంతి పండగ నాడు గుడివాడలో క్యాసినో విషయాన్ని ఆయన సభలో ప్రస్తావించారు. ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం రాజకీయంగా వేధింపులకు పాల్పడుతోందని, భయాందోళనలకు గురి చేస్తోందని అన్నారు.

తరలి వెళ్తోన్న పరిశ్రమలు..
తమ పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ కార్యాలయాలపై వైఎస్ఆర్సీపీ నాయకులు దాడులు చేశారని కనకమేడల రవీంద్ర కుమార్ విమర్శించారు. రాజకీయ నాయకుడు, పారిశ్రామికవేత్తల్లో భయాందోళనలు కలిగించేలా వైఎస్ఆర్సీపీ పరిపాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. ఫలితంగా- రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు ఏవీ రావట్లేదని, ఉన్న పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలి వెళ్తున్నాయని అన్నారు.

పవన్ కల్యాణ్ సినిమాలను అడ్డుకుంటోందంటూ..
చివరికి- ప్రభుత్వం సినిమా టిక్కెట్ల వ్యవహారంలోనూ జోక్యం చేసుకుందని కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో ప్రస్తావించారు. సినిమా టికెట్ల నియంత్రణ అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకుందని చెప్పారు. ప్రముఖ నటుడు, ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడైన పవన్ కల్యాణ్ సినిమాలకు ఏపీ ప్రభుత్వం ఉద్దేశపూరకంగా ఆటంకాలను సృష్టిస్తోందని అన్నారు. టికెట్ల రేట్ల నియంత్రణ ప్రభుత్వ చేతుల్లో ఉండటం వల్ల సినిమాలను వాయిదా వేసుకునే పరిస్థితి ఉందని చెప్పారు.

ఇసుక, మైనింగ్ మాఫియా..
ఏపీలో ఇసుక, మైనింగ్ మాఫియా రాజ్యమేలుతోందని కనకమేడల ఆరోపించారు. డ్రగ్స్ వ్యాపార కార్యకలాపాలు విస్తృతంగా సాగుతున్నాయని విమర్శించారు. డ్రగ్స్ హబ్గా ఏపీ మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అమరావతిని ఏపీ రాజధానిగా అంగీకరించిన వైఎస్ జగన్.. అధికారంలోకి వచ్చాక మాట మార్చారని, మూడు రాజధానులకు తెరలేపారని అన్నారు. ఏపీకి ఇప్పటికీ రాజధాని లేకుండా పోయిందని అన్నారు.












Click it and Unblock the Notifications