వైసీపీలో చేరిన టీడీపీ మాజీ మంత్రి అన్న కుమారుడు: మంత్రి బాలినేని సమక్షంలో: త్వరలో ఆయన కూడా.. !
ఒంగోలు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి శిద్ధా రాఘవరావు త్వరలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ వార్తలు వినిపిస్తోన్న వేళ.. మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. శిద్ధా రాఘవరావు సోదరుడి కుమారుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త శిద్ధా హనుమంత రావు టీడీపీకి గుడ్బై చెప్పారు. వైఎస్ఆర్సీపీలో చేరారు. ప్రకాశం జిల్లాకు చెందిన విద్యుత్, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ కండువాను కప్పుకొన్నారు.
ప్రకాశం జిల్లా టీడీపీలో ప్రకంపనలు..
శిద్ధా రాఘవరావు గుడ్బై చెప్పబోతున్నారంటూ వార్తలు రావడం, కొన్ని రోజుల్లోనే శిద్ధా హనుమంత రావు వైసీపీలో చేరడం వంటి కీలక పరిణామాలు వెంట వెంటనే చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాలు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీలో కలకలాన్ని రేపాయి. జిల్లాకు చెందిన కొందరు పార్టీ సీనియర్ నాయకులు శిద్ధా రాఘవరావుకు సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికీ.. ఆయన అందుబాటులో లేకుండా పోయినట్లు చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే.. త్వరలోనే ఆయన కూడా వైసీపీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారనే అభిప్రాయాలు జిల్లా రాజకీయాల్లో వ్యక్తమౌతున్నాయి.
టీడీపీకి విఘాతంలా..
మొన్నటికి మొన్న కనిగిరి మాజీ ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడైన కదిరి బాబురావు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆ మరుసటి రోజే జిల్లాకే చెందిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు వెంకటేష్, మాజీమంత్రి పాలేటి రామారావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా వైఎస్ఆర్సీపీ కండువాను కప్పుకొన్నారు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన శిద్ధా రాఘవరావు పార్టీని వీడే అవకాశాలు ఉండటం టీడీపీ నేతల్లో ఆందోళన వ్యక్తమౌతున్నట్లు చెబుతున్నారు.
టీడీపీ పట్టించుకోకపోవడం వల్లే..
గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన శిద్ధా రాఘవరావు, ఆయన కుమారుడు సుధీర్ కుమార్ ఇద్దరూ ఓటమి పాలయ్యారు. ఒంగోలు లోక్సభ స్థానం నుంచి రాఘవరావు, కనిగిరి అసెంబ్లీ సీటు నుంచి సుధీర్ కుమార్ పోటీ చేసి ఓడిపోయారు. ఓటమి తరువాత పార్టీ తనకు అండగా ఉండట్లేదనే అసంతృప్తి శిద్ధా రాఘవరావులో నెలకొని ఉందని, టీడీపీలోనే కొనసాగితే తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఉండదనే ఉద్దేశంతోనే పార్టీ ఫిరాయించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
Recommended Video
సోదరుడి కుమారుడితో బోణీ..
ఈ పరిణామాల మధ్య శిద్ధా రాఘవరావు అన్న కుమారుడు హనుమంతరావు వైసీపీలో చేరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనికోసం హనుమంతరావు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లి మరీ.. ఆయన సమక్షంలో వైసీపీలో చేరారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు పారిశ్రామికవేత్త శిద్దా హనుమంతరావు తెలిపారు. శిద్ధా రాఘవరావు కూడా వైసీపీలో చేరతారా? లేదా? అనే అంశంపై తానేమీ వ్యాఖ్యానించలేనని చెప్పారు.