వాళ్లను వదిలించుకుంటా - తేల్చి చెప్పిన చంద్రబాబు..!!
కార్యకర్తలను నాయకులుగా మలిచేందుకే శిక్షణ ఇస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేసారు. ప్రజలకు మంచి చేయాలి... నాయకులుగా ఎదగాలనే సంకల్పం తీసుకోవాలని సీఎం సూచించారు. డీఎస్సీ నిర్వహణపై చేస్తున్న దుష్ప్రచారానికి గట్టిగా ఇచ్చిన కౌంటర్లతో వైసీపీ కంగుతిందని చెప్పుకొచ్చారు. సర్వేలు చేయిస్తున్నామని... తప్పులు చేసిన వాళ్లను వదిలించు కుంటానని చంద్రబాబు తేల్చి చెప్పారు. కార్యకర్తలందరూ సీక్రెట్ అనే పుస్తకాన్ని చదవాలని సూచించిన చంద్రబాబు.. భవిష్యత్ కార్యాచరణ పై దిశా నిర్దేశం చేసారు.
సీఎం చంద్రబాబు పార్టీ క్లస్టర్ ఇంఛార్జ్ లతో సమావేశం అయ్యారు. సంకల్పం తీసుకుని పని చేస్తే... ఆ సంకల్పం నెరవేరడానికి కావాల్సిన ఎకో సిస్టం ఆటోమేటిగ్గా ఏర్పడుతుందని చెప్పు కుచ్చారు. మంచి ఆలోచనలు చేసే వాళ్ల చుట్టూ మంచి వాళ్లే తోడవుతారు.... చెడు ఆలోచనలు చేసే వాళ్ల చుట్టూ గొడ్డలి బ్యాచ్ జమ అవుతుందని వ్యాఖ్యానించారు. ఇకపై పార్టీకి ఓటమి లేదు... రాదు అని ధీమాగా చెప్పిన చంద్రబాబు... ఆ స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలతో మంచిగా ఉంటున్నాం, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నాం, సంక్షేమం-అభివృద్ధి చేస్తున్నాం, ప్రజలకు స్వేచ్ఛను ఇచ్చాం, ముఖ్యంగా ఆత్మ విమర్శ చేసుకుంటున్నామని... అందుకే ఓటమి రాదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. పార్టీ పదవులు మొదలుకుని టిక్కెట్ల కేటాయింపుల వరకు నిరంతరం సర్వేలు చేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు.

మిత్రపక్షాలతో సమన్వయం చేసుకోవాలి
ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని వివరించారు. రాష్ట్ర, పార్టీ శ్రేయస్సు కోసం తప్పులు చేసిన వాళ్లని, తేడాగా ఉన్నవాళ్లని వదిలించుకుంటానని.. ఎన్నికల్లో కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఏం ప్రచారం చేశారో... అవన్నీ ప్రభుత్వం చేస్తోందన్నారు. ప్రభుత్వం చేస్తోన్న మంచిని గడప గడపకు వెళ్లి చెప్పాలి. ఆనాడు చెప్పిన వాటిని ఈనాడు నెరవేరుస్తున్నామనే విషయాన్ని ప్రజలకు గుర్తు చేయాలని సూచించారు. యుద్దాన్ని గెలిపించే బాధ్యత తనదని... తనతో పాటు అలుపెరగకుండా యుద్దం చేసే బాధ్యత మీది అని స్పష్టం చేసారు. రాష్ట్రంలోని ప్రతి బూత్ లోనూ గతానికి మించి ఓట్లు రావాలని స్పష్టం చేసారు. అదే విధంగా కార్యకర్తలను ఆదుకునేందుకు పార్టీ పరంగా చేయాల్సిందంతా చేస్తాం... అన్ని రకాలుగా అండగా ఉంటాం... ప్రభుత్వం చేసే అభివృద్ధిని అందిపుచ్చుకునేలా కార్యకర్తలు ఆలోచించాలని చంద్రబాబు సూచించారు. కూటమితోనే వెళ్తున్నాం.. వెళ్తాం. దీనికి అనుగుణంగా కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో వ్యవహరించాలని నిర్దేశించారు.













Click it and Unblock the Notifications