గీత దాటితే వేటే.. ! వాళ్లకు టీడీపీ ఫైనల్ వార్నింగ్..!
టీడీపీ (TDP) సిద్ధాంతానికి, క్రమశిక్షణకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కట్టుబడి పని చేయాలని, పార్టీ లైన్ దాటితే ఒకటి రెండు సార్లు హెచ్చరిస్తామని, తీరు మారకపోతే వేటు తప్పదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు ఇవాళ తేల్చిచెప్పేశారు. పార్టీ సిద్ధాంతాలు, పార్టీ లైన్ ప్రతి ఒక్కరికీ సమానంగా వర్తిస్తాయని, తమకు వచ్చిన గుర్తింపు, గౌరవం పార్టీ ద్వారానే వచ్చిందని ఎప్పుడూ గుర్తుంచుకోవాలని కోరారు. కాబట్టి వ్యక్తిగత ప్రయోజనాలు, వ్యక్తిగత అభిప్రాయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధికే ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.
రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని, ప్రజలంతా అపారమైన విశ్వాసంతో కూటమికి మద్దతు ఇచ్చారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 94 శాతం స్ట్రైక్ రేట్తో కూటమిని గెలిపించారని, ఈ విజయానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీల నాయకత్వం, శ్రమ, త్యాగం, కృషి కారణమని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ఈ సమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణతో వ్యవహరించాలని కోరారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు.

ఎంతటి నాయకుడైనా, ఎంతటి ప్రజాప్రతినిధైనా పార్టీ క్రమశిక్షణకు లోబడాల్సిందే అన్నారరు. రాష్ట్ర ప్రయోజనాలకు, పార్టీ ప్రయోజనాలకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తెలియక చేసినా, అత్యుత్సాహంతో చేసినా పార్టీకి నష్టం కలిగించే చర్యలు జరగకుండా జాగ్రత్త పడాలని సూచించారు. పార్టీకి లాభం చేకూర్చే విధంగానే ప్రతి ఒక్కరి ప్రవర్తన ఉండాలన్నారు. పార్టీకి విఘాతం కలిగించే వారిపై క్రమశిక్షణా చర్యలు తప్పవన్నారు. కార్యకర్తలకు అత్యధిక స్వేచ్ఛ ఇచ్చే పార్టీ టీడీపీ అని, అయితే ఆ స్వేచ్ఛను ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయకూడదన్నారు. పార్టీ గీత దాటితే ముందుగా ఒకటి, రెండు సార్లు హెచ్చరిస్తామని, అయినా తీరు మార్చుకోకపోతే పార్టీ క్రమశిక్షణ ప్రకారం చర్యల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. పలువురు నేతలు వైసీపీ నేతలతో అంటకాగుతున్నారన్న విమర్శల నేపథ్యంలో అధిష్టానం ఈ హెచ్చరికలు చేసింది.












Click it and Unblock the Notifications