ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి గెలిచారు: ఎమ్మెల్సీ ఎన్నికలపై జగన్ మీడియా!
ప్రలోభాలు, బెదిరింపులు, అక్రమ కేసులు, ఒత్తిళ్లతో టీడీపీ అనుకున్నదని సాధించిందని సాక్షి మీడియా అభిప్రాయపడింది.
కడప: క్రాస్ ఓటింగ్పై జగన్ పెట్టుకున్న నమ్మకాలేవి ఆ పార్టీకి కలిసిరాలేదు. వైసీపీ నుంచి గెలిచిన స్థానిక సంస్థల నేతలు టీడీపీలోకి ఫిరాయించడం తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపింది. ఫలితంగా 34ఏళ్ల చరిత్ర బద్దలైంది. కడప అంటే వైఎస్ ఇలాఖా అన్న ముద్రను చెరిపేసేలా అక్కడ పాగా వేయడంలో టీడీపీ సఫలమైంది.
గెలుపోటములకు కారణాలకు విశ్లేషించుకునే క్రమంలో వైసీపీ అధినేత జగన్ సొంత మీడియా అయిన సాక్షి ఈ ఓటమిపై ఎలా స్పందిస్తున్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో సాక్షి మీడియా వెలువరించిన కథనాన్ని పరిశీలిస్తే.. టీడీపీ దౌర్జన్యపూరితంగా ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకుందనేది ఆవైపు నుంచి వస్తోన్న ప్రధాన ఆరోపణ.
ప్రలోభాలు, బెదిరింపులు, అక్రమ కేసులు, ఒత్తిళ్లతో టీడీపీ అనుకున్నది సాధించిందని సాక్షి మీడియా అభిప్రాయపడింది. ప్రజల్లో టీడీపీ పట్ల అనుకూలత లేకపోయినా.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి మరీ అధికార పక్షం అడ్డదారిలో ఎన్నికల్లో విజయం సాధించిందని ఆరోపించింది.
కాగా, కడప స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డిపై టిడిపి అభ్యర్థి బీటెక్ రవి 33 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తొలి రౌండ్ లోవైఎస్ వివేకానందరెడ్డి ఆధిక్యం కనబరిచినప్పటికీ.. రెండో రౌండ్ ముగిసేసరికి టిడిపి అభ్యర్థి ఆయన్ను వెనక్కి నెట్టారు.
ఇక కర్నూల్ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి తన సమీప వైసిపి అభ్యర్థి గౌరు వెంకట్ రెడ్డిపై 56 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తొలుత వైసీపీ అభ్యర్థి గౌరు వెంకట్ రెడ్డి ఆధిక్యం కనబరిచినప్పటికీ.. ఆ తర్వాత శిల్పా చక్రపాణి పుంజుకున్నారు.శిల్పా చక్రపాణికి 565ఓట్లు పోలవగా, వెంకటరెడ్డికి 501ఓట్లు వచ్చాయి.
నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల విషయానికొస్తే.. వైసీపీ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డిపై 87ఓట్ల తేడాతో వాకాటి నారాయణరెడ్డి గెలుపొందారు. మొత్తం 851ఓట్లు పోలవగా, టీడీపీ అభ్యర్థికి 462, వైసీపీకి 378ఓట్లు పోలయ్యాయి. మొత్తం మీద ఈ ఎన్నికల్లో టీడీపీ అతి కష్టం మీద విజయం సాధించనేది జగన్ తరుపు మీడియా వాదన.