‘సుప్రీం’ ఉండగా నా పేరుతో సేవా కార్యక్రమాలా? వద్దు: లోకేష్
గుంటూరు: తన పేరు మీదుగా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయకూడదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం పలువురు పార్టీ కార్యకర్తలు ఆయనను కలిసి పలు అంశాలపై చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా నారా లోకేష్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని లోకేష్కు కార్యకర్తలు విన్నవించారు. దీనిపై స్పందించిన లోకేష్ ఎవరికైనా పార్టీ సుప్రీం అని, తన పేరుతో సేవా కార్యక్రమాలు వద్దని సుతిమెత్తగా తిరస్కరించారు. మనకు అందరికీ సుప్రీం అయిన పార్టీ పేరుతోనే సేవా కార్యక్రమాలు చేయాలని కార్యకర్తలకు లోకేష్ సూచించారు.
శ్రీవారి పాదాల చెంత పోలవరం డిజైన్
రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన స్పిల్ వే గేట్ల డిజైన్లు సిద్ధమయ్యాయని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖామంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు వెల్లడించారు. పోలవరం స్పిల్ వే గేట్ల డిజైన్లను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో వాటిని తీసుకొని మంత్రి, డిజైన్ రూపకర్త కన్నయ్యనాయుడు, ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు కలిసి శనివారం రాత్రి తిరుమల చేరుకున్నారు.

ఈ సందర్భంగా ఆదివారం ఉదయం ఈ డిజైన్లను స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంకల్పానికి శ్రీవారి ఆశీస్సులు తోడై ప్రాజెక్టులో అత్యంత కీలకమైన స్పిల్ వే గేట్ల డిజైన్లను 15 రోజులు వ్యవధిలో పూర్తిచేయగలిగామని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును 2018 జూన్ నాటికి పూర్తిచేసి పవిత్రమైన గోదావరి తల్లి నీటిని ఆంధ్రుల గుండెల్లో నిల్వచేసుకోవాలనే కలను నెరవేరుస్తామని అన్నారు. రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తులు, దిగుబడుల రూపురేఖలను మార్చేసే పోలవరం ప్రాజెక్టు ఎంతో కీలకమన్నారు. ఈ డిజైన్లను హిడాయ్ సంస్థ సహకారంతో హైడ్రాలిక్ నిష్ణాతుడు కన్నయ్యనాయుడు, ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు పూర్తిచేశారని తెలిపారు. ఈ డిజైన్లను ఆమోదం కోసం కేంద్ర జల సంఘానికి పంపుతామని వివరించారు.












Click it and Unblock the Notifications