ముంబైలో ఆంధ్ర టెక్కీ అనూహ్య హత్య: సాక్షుల వాంగ్మూలాలు నమోదు
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో నిరుడు అత్యాచారానికి హత్యకు గురైన ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఈస్తర్ అనూహ్య(23) కేసులో స్థానిక సెషన్స్ కోర్టు 39 మంది సాక్షుల వాంగ్మూలాల నమోదును శుక్రవారం పూర్తిచేసింది.
టీసీఎస్ కంపెనీ అసిస్టెంట్ సిస్టమ్ ఇంజినీర్ అయిన ఆమె నిరుడు జనవరి 5న ముంబై వచ్చినప్పుడు ఆమె అత్యాచారానికీ, హత్యకు గురైంది. కుర్లా రైల్వే స్టేషన్లోని లోకమాన్య తిలక్ టెర్మినస్ వద్ద దిగిన తర్వాత అనూహ్య అదృశ్యమయ్యింది. రైల్వే స్టేషన్లో ఒంటరిగా కూర్చున్న ఆమెను చంద్రభాన్ సనప్(28) అనే వ్యక్తి తన బైక్పై లిఫ్ట్ ఇస్తానని మభ్యపెట్టి నిర్జన ప్రదేశానికి తీసుకుపోయాడు.
అనూహ్య దగ్గర ఉన్న డబ్బును దోచుకునేందుకు ప్రయత్నించగా, ఆమె ప్రతిఘటించడంతో చంపేశాడని పోలీసులు తెలిపారు. ఆమె అత్యాచారానికి కూడా గురైనట్లుగా అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన జరిగిన 11 రోజుల తర్వాత ఆమె మృతదేహాన్ని ముంబై శివారులో భండప్ వద్ద పోలీసులు కనుగొన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని బందరుకు చెందిన అనూహ్య ముంబైలోని టిసిఎస్లో పనిచేస్తూ ముంబైలోని అంథేరీలో ఉండేది. క్రిస్మస్ పండుగకు 2013 డిసెంబర్ 22వ తేదీన మచిలీపట్నం వచ్చిన అనూహ్య నిరుడు జనవరి 5వ తేదీన ముంబై చేరుకుంది. ఆమె ముంబైలోని ఎల్ఎఎల్టి నుంచి కనిపించకుండా పోయింది. ఆమె శవం జనవరి 16వ తేదీన భందుప్ (తూర్పు)లోని టాటా నగర్ పొదల్లో కనిపించింది.