ప్రమాదం: లక్షలఉద్యోగం సంపాదించి మృతి చెందిన టెక్కీ
హైదరాబాద్: మహబూబ్నగర్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన వోల్వో బస్సు ప్రమాదంలో బందర్ పట్టణానికి చెందిన ఒక యువకుడు సజీవ దహనమయ్యాడు. స్థానిక వర్రేగూడెంకు చెందిన సురేష్ బాబు(27) బెంగుళూరులో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్వ్యూ కోసం శనివారం రాత్రి హైదరాబాద్ నుండి వెళ్ళాడు.
సోమవారం జరిగిన ఇంటర్వ్యూలో సురేష్ బాబు ఎంపికయ్యాడు. సంవత్సరానికి రూ.7.5 లక్షల జీతంతో ఉద్యోగం సాధించిన సురేష్ బాబు ఆనందోత్సాహంతో అదే రోజు రాత్రి హైదరాబాద్కు ప్రైవేటు ట్రావెల్ బస్సులో తిరుగు ప్రయాణమయ్యాడు. మరో గంటలో హైదరాబాద్ చేరాల్సిన బస్సు ఆకస్మికంగా అగ్నికి ఆహుతైన దుర్ఘటనలో సజీవదహనమయ్యాడు.
సురేష్ బాబు స్థానిక ఎస్విహెచ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. గత కొంత కాలంగా హైదరాబాద్లో ఓ చిన్న కంపెనీలో పని చేస్తూ అతను ఏడాది క్రితం ఆ ఉద్యోగం మానేసి ఉన్నత ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్న సురేష్ సంవత్సరానికి లక్షల జీతంతో ఉద్యోగం సంపాదించిన కొన్ని గంటల్లోనే అగ్నికి ఆహుతి కావడం పట్టణవాసులను కలచివేసింది.