కెసిఆర్తో పొత్తు వద్దు: రేణుకపై గొడవ, జానా డుమ్మా
హైదరాబాద్: కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలో జరిగిన తెలంగాణ పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం గురువారం వాడిగా, వేడిగా జరిగింది. కె. చంద్రశేఖర రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తును మెజారిటీ సభ్యులు వ్యతిరేకించినట్లు సమాచారం. తెరాసను కాంగ్రెసులో విలీనం చేస్తే తమకు అభ్యంతరం లేదని, అయితే పొత్తు మాత్రం వద్దని వారు దిగ్విజయ్ సింగ్కు చెప్పినట్లు తెలుస్తోంది.
కాగా, రేణుకా చౌదరిని తెలంగాణ ప్రచార కమిటీలో వేయడంపై కొంత మంది నాయకులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. రేణుకా చౌదరిని ప్రచార కమిటీ నుంచి తప్పించాలని పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఆయనకు మరికొంత మంది నాయకులు మద్దతు తెలిపారు. ఆమె తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించారని, తెలంగాణలో ఆమెపై వ్యతిరేకత ఉందని, ఆమె తెలంగాణకు చెందిన నేత కాదని పొన్నం ప్రభాకర్ వాదించినట్లు తెలుస్తోంది.
తెలంగాణకు వ్యతిరేకంగా ఆమె మాట్లాడిన విషయాలను ఆయన దిగ్విజయ్ సింగ్కు వివరించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయాన్ని రాతపూర్వకంగా ఇవ్వాలని, పార్టీ అదిష్టానం పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. దాంతో పొన్నం ప్రభాకర్ మరికొంత మంది రాతపూర్వకంగా రేణుకా చౌదరిపై ఫిర్యాదు చేశారు. సమావేశంలో రేణుకా చౌదరి లేరు.
కాగా, కాంగ్రెసు సీనియర్ నేత కె. జానారెడ్డి అలక వీడినట్లు లేరు. ఆయన ఎన్నికల కమిటీ సమావేశానికి హాజరు కాలేదు. పిసిసి అధ్యక్ష పదవిని తనకు ఇవ్వకపోవడంపై ఆయన అలిగారు. అధిష్టానం పెద్దలు నచ్చజెప్పినప్పటికీ ఆయన అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది.