టి తమ్ముళ్లు అమాయకులు!, ఏమౌతే ఏంటి: టిపై జెపి
రాజమండ్రి: తెలంగాణ తమ్ముళ్లు అమాయకులని, వారు భ్రమల్లో ఉన్నారని లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు, కూకట్పల్లి శాసన సభ్యుడు జయప్రకాశ్ నారాయణ బుధవారం అన్నారు. ఢిల్లీ నుండి తెలుగు జాతిని శాసించే అధికారం కాంగ్రెసు పార్టీకి ఎక్కడిదని, ఆ పార్టీకి శాశ్వత విశ్రాంతిని ఇద్దామన్నారు. ఆయన రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడారు.
ప్రాంతాలు, ప్రజల అభివృద్ధిని పట్టించుకోకుండా అంతా తీసుకెళ్లి హైదరాబాద్నే అభివృద్ధి చేస్తే ప్రయోజనం ఏమిటని, ఇటువంటి భావాలుకల నేతలున్న సమయంలో రాష్ట్రం విడిపోతే ఏమిటి? కలిసుంటే ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ తమ్ముళ్లు అమాయకులని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, తమందరికి ఉద్యోగాలు వచ్చేస్తాయని, ఇళ్లులేని వారందరికి ఇళ్లు నిర్మించేస్తారని భ్రమపడుతున్నారని ఆయన అన్నారు.

రాష్ట్రంలో తెలుగు జాతిని విచ్ఛిన్నం చేసేందుకు, ప్రాంతాల మధ్య వివాదాలు రేకెత్తిస్తూ విభజన నిర్ణయాలు తుసుకునే అధఇకారం ఢిల్లీ పెద్దలుగా చెప్పుకుంటున్న గద్దలకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. జాతి, కులం, వర్ణం, లింగ వివక్షల్లేకుండా ఎవరు ఎక్కడైనా స్వేచ్ఛగా జీవించే హక్కుందని రాజ్యాంగం చెబుతుంటే దానిని ధిక్కరిస్తూ విభజన నిర్ణయాలు ఏ ప్రాతిపదికన తీసుకుంటున్నారన్నారు.
రాష్ట్రంలో పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని, ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. కేంద్రప్రభుత్వం ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నదని ధ్వజమెత్తారు. అధికారం ఉందన్న అహంతో అజ్ఞానులు రాజ్యమేలుతున్నారని, వీళ్లు ఢిల్లీ సుల్తానులా, మొఘల్ చక్రవర్తులా అని ఆయన విరుచుకుపడ్డారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం ఆనాడు పంజాబ్లో చిచ్చుపెట్టిన కాంగ్రెస్ తరువాత కాశ్మీర్లో పెట్టిన చిచ్చు ఇప్పటివరకు కొనసాగుతూనే ఉందన్నారు.












Click it and Unblock the Notifications