హైద్రాబాద్లో భూములు అమ్మే యోచనలో కేసీఆర్!
హైదరాబాద్: రైతుల రుణమాఫీ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖరీదైన భూములను అమ్మాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో గల మూడు జిల్లాల్లోని దాదాపు వంద మండలాల్లో రుణాల రీషెడ్యూల్కు ఆర్బీఐ సిద్ధమని చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ.లక్ష చొప్పున మాఫీ చేస్తామని తెలిపింది. ఆ మొత్తం తెలంగాణ రూ.19వేల కోట్లు కానున్నాయి.
ఇప్పుడు ఆర్బీఐ రీషెడ్యూల్ చేసేవి రూ.నాలుగు కోట్లు మాత్రమే. దీంతో మిగిలిన రూ.15వేల కోట్ల రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాదు నగరంలోని ఖరీదైన భూములను అమ్మి రుణమాఫీ చేయాలని చూస్తోంది.
ఆర్బీఐ ఇటీవలే రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలోని దాదాపు 100 మండలాల్లో మాత్రమే రీషెడ్యూల్కు ఒప్పుకుంది. మిగిలిన జిల్లాల్లో, మిగిలిన మొత్తం.. రూ.15వేలకోట్లను ప్రభుత్వ స్థలాలను అమ్మి సమకూర్చుకోవాలని సూత్రప్రాయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్లో ఏయే స్థలాలను అమ్మాలన్న విషయంపై కేసీఆర్ సర్కార్ ఆలోచన చేస్తోంది.
హైదరాబాదు నడిబొడ్డున లోయర్ ట్యాంక్ బండ్ వద్ద గల డీబీఆర్ మిల్స్ను అమ్మే విషయమై ప్రభుత్వం ఆలోచన చేస్తోందట. డీబీఆర్ మిల్స్కు చెందిన 24 ఎకరాలను అమ్మడం ద్వారా రూ.వెయ్యి కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోందట.
కాగా, గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పథకాల కోసం హైదరబాద్ శివార్లలోని భూములతో పాటు, మిగతా నగరాల్లోని ప్రభుత్వ భూములను అమ్మింది. ఈ భూముల అమ్మకం ద్వారా నాటి సర్కారుకు కోట్లాది రూపాయలు వచ్చాయి. ఈ డబ్బును సంక్షేమ పథకాల కోసం వైయస్ సర్కారు అప్పట్లో ఖర్చు పెట్టింది.