జనసేన 35/5... TDP 25/3?
ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు కుదరడం దాదాపుగా ఖాయమైంది. ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ గత అక్టోబరులో విజయవాడలో ఒకసారి కలవగా, తాజాగా హైదరాబాద్ లో కలిశారు. కుప్పం సంఘటనపై సంఘీభావం తెలిపేందుకే కలిశానంటున్నప్పటికీ బలమైన పొత్తు దిశగా, సీట్లపై స్పష్టత కోసమే వారిద్దరి కలయిక అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

జనసేనను నిరాశపరిచిన వపన్ ఓటమి
రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్ సభ నియోజకవర్గాలున్నాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 23 అసెంబ్లీ, 3 లోక్ సభ స్థానాలు వచ్చాయి. జనసేన ఒక్క రాజోలు నియోజకవర్గంలోనే గెలవగలిగింది. టీడీపీ నుంచి నలుగురు, జనసేన ఎమ్మెల్యే రాపాక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధ ఎమ్మెల్యేలుగా మారారు. పవన్ కల్యాణ్ రెండు నియోజకవర్గాల్లో ఓటమిపాలు కావడం జనసేన శ్రేణులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనైనా టీడీపీతో పొత్తు పెట్టుకొని పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలను తనతోపాటు అసెంబ్లీకి తీసుకువెళ్లాలనే దృఢ సంకల్పాన్ని పవన్ కనపరుస్తున్నారు.

35 అంటున్న జనసేన..?
పొత్తు ఖాయమని వార్తలు వస్తున్న తరుణంలో జిల్లాలోని తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జిలు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించే నియోజకవర్గాలపై అవగాహన ఉన్న ఇన్ ఛార్జిలు సైలెంటయ్యారు. కోట్లు ఖర్చుపెట్టి తిరగాల్సిన అవసరం లేదని, సీటు వస్తుందన్న నమ్మకం ఉంటేనే పార్టీ కార్యక్రమాలు జరుపుతామంటూ అంతరంగికులతో చెబుతున్నారు. 175 నియోజకవర్గాల్లో 35, 5 లోక్ సభ స్థానాలు కేటాయించాలనే ప్రతిపాదన పవన్ చంద్రబాబు ముందు ఉంచినట్లు తెలుస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం 25 అసెంబ్లీ, 3 లోక్ సభ సీట్లు ఇవ్వడానికి ముందుకొచ్చింది.

బలమున్న జిల్లాల్లోనే సీట్లివ్వండి..
అయితే తనకు గట్టిగా ఇన్నే సీట్లు కావాలనే మొండి పట్టుదలను తమ నేత చూపించడంలేదని, అవసరార్థం, రాష్ట్రంలో వైసీపీని గద్దె దించే లక్ష్యంతోనే అవసవరమైతే ఒకడుగు వెనక్కి అయినా వేస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు. నియోజకవర్గాలవారీగా జనసేనకు రాష్ట్రంలో బలమైన నాయకులు లేరు. దీంతో తనకు బలమున్న తిరుపతి, అనంతపురం, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలు, ఉత్తరాంధ్రలోని నియోజకవర్గాలే కేటాయించామని కోరుతోంది. బాదుడే బాదుడు కార్యక్రమంద్వారా జిల్లాల్లో పర్యటించిన చంద్రబాబు ఏడాది ముందుగానే జనసేనకివ్వాల్సిన నియోజకవర్గాలపై ఒక అవగాహనకు వచ్చారని, ఆయా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జిలను కూడా అందుకే నియమించలేదని పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications