జగన్ కు లేఖ రాసిన కౌలు రైతుల సంఘం .. సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలని లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఏపీ కౌలు రైతుల సంఘం బహిరంగ లేఖ రాసింది. రాష్ట్రంలో కౌలు రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను ఏకరువు పెట్టింది. కౌలు రైతుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని లేఖలో కోరింది. రాష్ట్రంలో కౌలు రైతుల సంక్షేమాన్ని పట్టించుకునే నాధుడే లేరని ఆవేదన వ్యక్తం చేసింది.
కౌలు రైతుల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలని కోరిన కౌలు రైతుల సంఘం
ఏపీలో ప్రస్తుతం 32 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగబోయిన రంగారావు, కార్యదర్శి పి.జమలయ్య తెలిపారు. అన్ని ప్రాంతాలు, పంటల విషయంలో కౌలు వ్యవసాయం విస్తరిస్తోందని వ్యాఖ్యానించారు. ఇన్ని లక్షల సంఖ్యలో కౌలు రైతులు ఉన్నప్పటికీ సంక్షేమ ఫలాలు కౌలు రైతులకు అందని ద్రాక్షగానే మారాయని వారు లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం కౌలు ధరలు పెరుగుతూనే ఉన్నాయనీ, ఇన్ పుట్ ధరలు, వడ్డీల భారంతో కౌలు రైతులు కుంగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే కౌలు రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను కేటాయించాలని కోరారు.
ప్రభుత్వ ఫలాలు కౌలు రైతులకు అందటం లేదన్న కౌలు రైతుల సంఘం
ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కౌలు రైతులను ఆదుకోవాలన్న ప్రస్తావనే ఉండటం లేదని గుర్తుచేశారు. బ్యాంకర్లు పంట రుణాల జారీ సందర్భంగా కూడా కౌలు రైతులను పట్టించుకోవడం లేదన్నారు. వ్యవసాయం చెయ్యకున్నా సొంత భూమి రైతులకు బ్యాంకర్లు పంట రుణాలు ఇస్తున్నారని, ఇక ప్రభుత్వ ఫలాలు సైతం వారికే అందుతున్నాయి కానీ కౌలు రైతులను ఎవరూ పట్టించుకోవటం లేదంటూ లేఖలో పేర్కొన్నారు.
కేంద్రం అందించే పెట్టుబడి సాయంలో కూడా అన్యాయమే అంటున్న కౌలు రైతులు
గతంలో జరిగిన రుణమాఫీలో కౌలురైతులు దగాపడ్డారని, కౌలు రైతుల రక్షణ, సంక్షేమం జరగాలన్నా, వ్యవసాయం లాభసాటిగా మార్చాలన్నా కౌలు రైతులను పట్టించుకోవాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా కౌలు రైతులను పట్టించుకోకుండా పెట్టుబడి సాయాన్ని కేవలం భూమి ఉన్న రైతులకే ఇస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి సాయం విషయంలో కౌలు రైతులను ప్రభుత్వం విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న కౌలు రైతులకు అన్నిరకాలుగా అన్యాయం జరుగుతోందని వారు బహిరంగ లేఖా ముఖంగా వాపోయారు .