తిరువూరులో టెన్షన్... బోసు బొమ్మ దగ్గర తేల్చుకుందాం రండి.. టీడీపీ వర్సెస్ వైసీపీ!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుంది. ఏపీలో ఎన్నికలకు సమయం ఉండగానే, ఇప్పటి నుంచే రాజకీయాలు వాడి వేడిగా సాగుతున్నాయి. నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటూ, సవాళ్లకు దిగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాలలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు రాష్ట్రంలో పరిస్థితిని ఉద్రిక్తంగా మారుస్తున్నాయి.
ఒక పక్క యువగళం పాదయాత్ర పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, మరోపక్క చంద్రబాబు సైతం ప్రజా క్షేత్రంలో పర్యటనలు చేస్తూ వైసీపీ పాలనపై విరుచుకుపడుతున్నారు. ఇక తాజాగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో టిడిపి, వైసిపి నేతల సవాళ్ళతో పొలిటికల్ హీట్ చోటుచేసుకుంది. తిరువూరు అభివృద్ధి చేసింది మేము అంటే మేము అంటూ ఇరు పార్టీల నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు.

తిరువూరు అభివృద్ధిపై వైసీపీ ఎమ్మెల్యే రక్షణ నిధికి మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామి దాస్ సవాల్ విసిరారు. బోసు బొమ్మ సెంటర్ వద్ద తిరువూరు అభివృద్ధి చేసింది ఎవరో తేల్చుకుందాం రమ్మంటూ చాలెంజ్ చేశారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యే రక్షణ నిధి తాము సవాలును స్వీకరిస్తున్నట్లు, బోసు బొమ్మ సెంటర్ దగ్గరకు వస్తామని వెల్లడించారు.
దీంతో ఇరు వర్గాలు బోసు బొమ్మ సెంటర్ వద్దకు వెళ్లడానికి సిద్ధం కాగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు టిడిపి నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి వాసం మునియ్యను, మాజీ ఎమ్మెల్యే స్వామి దాస్ ను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్టు చేశారు. ఆపై వైసీపీ ముఖ్య నాయకులను సైతం హౌస్ అరెస్టు చేసిన పోలీసులు పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు.
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే విసిరిన సవాల్ తో వైసిపి నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా తిరువూరులోని స్థానిక బోసు బొమ్మ సెంటర్ వద్దకు బయలుదేరారు. అయితే వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. అంతకుముందు పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications