రాయలసీమలో రెండో రాజధాని, తరిమేస్తారు: టీజీ వెంకటేష్
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని గుంటూరు-కృష్ణా జిల్లాల్లో ఉన్న నేపథ్యంలో.. రెండో రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత టీజీ వెంకటేష్ సోమవారం డిమాండ్ చేశారు.
ఎర్రచందనంతో వచ్చే ఆదాయాన్ని రాయలసీమకే ఖర్చుచేయాలని కోరారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నారు. లేదంటే ఆంధ్రా నుంచి రాయలసీమను తరిమేసే రోజులు వస్తాయన్నారు.
కాగా, టీజీ వెంకటేష్ సమైక్యాంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పని చేశారు. చిన్న నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. విభజన అనంతరం.. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ఆయన టీడీపీలో చేరి, పోటీ చేసి, ఓడిపోయారు.
ప్రత్యేక హోదా కోసం అరగుండుతో ఆందోళన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విజయనగరం, కర్నూలు జిల్లాల్లో ధర్నాలు జరిగాయి. విజయనగరం కలెక్టరేట్ ఎదుట అరగుండుతో విశాలాంధ్ర మహాసభ సభ్యులు ఆందోళన చేశారు. కర్నూలులో జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు.