కావాలనే తాత్సారం: టీడీపీ-బీజేపీల మధ్య చిచ్చుపెట్టనున్న టీజీ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీల మధ్య చిచ్చు రాజేసినట్లుగా కనిపిస్తోంది. మంగళవారం టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ బీజేపీపై చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం అంటున్నారు.
రాజ్యసభ వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేకహోదాపై బీజేపీ కావాలనే తాత్సారం చేస్తోందని మండిపడ్డారు. సభలో కేవీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లు చర్చకు రాకుండా బీజేపీని అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు.
ఏపీకి కొద్దో గోప్పో ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే కేంద్రంలో భాగస్వాములుగా ఉన్నామని చెప్పిన ఆయన రాష్ట్ర ప్రయోజనాల కంటే తమకు ఏదీ ముఖ్యం కాదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఏపీ ప్రజలను నిలువునా ముంచిన కాంగ్రెస్ పార్టీ పెట్టిన బిల్లుకు టీడీపీ మద్దతు ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.

మంగళవారం రాజ్యసభలో ఏపీకి ప్రత్యేకహోదా బిల్లుపై ఓటింగ్కు కాంగ్రెస్ పార్టీ పట్టు పట్టింది. దీనికి డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ అంగీకరించకపోవడంతో కాంగ్రెస్ నేతలు పొడియంను చుట్టుముట్టి, ప్లకార్డులు చేతబట్టి, నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు.
ఇలా కాంగ్రెస్ నేతల నినాదాల మధ్య సభ సజావుగా సాగకపోవడంతో రాజ్యసభ పలు దఫాలుగా వాయిదా పడింది. తిరిగి మధ్యాహ్నాం ప్రారంభమైంది. ఈ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య ఆసక్తికర సంవాదం జరిగింది. చివరకు రాజ్యసభలో లీడర్ ఆఫ్ ద హౌస్ అరుణ్ జైట్లీ మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేకహోదా బిల్లు ద్రవ్యబిల్లు అని, దానిని రాజ్యసభలో చర్చించడం తగదని చెప్పారు.
దీంతో కాంగ్రెస్ నేతల ఆందోళనలు మరోసారి మిన్నంటాయి. ఈ క్రమంలో డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ రాజ్యసభను బుధవారం ఉదయానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications