పరిటాల శ్రీరామ్ పై కేసు నమోదు
తెలుగుదేశం పార్టీ యువనేత, ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ పై కేసు నమోదైంది. ప్రజల మధ్య వివాదాలు రేకెత్తించేలా ప్రసంగించారంటూ వైసీపీ మండల కన్వీనర్ జొన్నగిరి బాలపోతన్న ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. శ్రీరామ్ తోపాటు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి పరశురామ్పై ఐపీసీ సెక్షన్ 153 ఏ, 505 (2) కింద కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
ఆత్మకూరు మండలం సింగంపల్లి, వై.కొత్తపల్లి, పి.యాలేరు, ఆత్మకూరు మీదుగా పరిటాల పాదయాత్ర చేశారు. రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత గ్రామాల్లో అరటి, టమోటా పంటలను పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వై.కొత్తపల్లిలో పరిటాల శ్రీరామ్ కాడి పట్టగా.. మాజీ మంత్రి పరిటాల సునీత విత్తనం వేశారు. తర్వాత సభలో కార్యకర్తలనుద్దేశించి పరిటాల శ్రీరామ్ ప్రసంగిస్తూ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
తెలుగుదేశం పార్టీ హయాంలో ఎక్కడా అభివృద్ధి పనులు చేపట్టలేదంటూ ఎమ్మెల్యే అసత్య ప్రచారం చేస్తున్నారని, అప్పట్లో తమ ప్రభుత్వం నిర్మించిన రోడ్లు, వంతెనలపైనే నిలబడి ఎమ్మెల్యే ప్రసంగిస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సునీత సూచించారు. పేరూరు జలాశయానికి రూ.803 కోట్లు మంజూరు చేయించి పనులు చేపట్టామన్నారు. పేరూరు కాల్వ పూర్తిచేసి భూములిచ్చిన రైతులకు పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్తు మీటర్లు ఏర్పాటు చేసేందుకు ఎవరైనా వస్తే తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే తోపుదుర్తి ఎన్నికల ఖర్చు ఇంతైందని, అది చెల్లించాలంటూ జాకీ కంపెనీ యాజమాన్యాన్ని ఒత్తిడి చేయడంవల్లే కంపెనీ తరలిపోయిందని పరిటాల సునీత ఇటీవలే ఘాటు విమర్శలు చేశారు. తమ ప్రభుత్వం ఉపాధి కల్పన కోసం ఎంతో కష్టపడి కంపెనీలను తీసుకువస్తే వైసీపీవారు వెళ్లగొడుతున్నారంటూ మండిపడ్డారు.