గాలి జనార్ధనరెడ్డికి మేలు చేసేందుకే - ఐఏఎస్ శ్రీలక్ష్మీ పై సీబీఐ వాదనలు : హైకోర్టు తీర్పు రిజర్వ్..!!
ఏపీ ఐఏఎస్ శ్రీలక్ష్మి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్రెడ్డి, ఆయనకు చెందిన ఓబులాపూరం మైనింగ్ కంపెనీకి (ఓఎంసీ) అయాచిత లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని న్యాయస్థానం ముందు వాదించింది. ఓఎంసీకి మైనింగ్ లీజులు కట్టబెట్టటంలో శ్రీలక్ష్మీ విచక్షణాధికారాన్ని దుర్వినియోగం చేసారని సీబీఐ హైకోర్టుకు నివేదించింది. ఓఎంసీ కేసులో మైనింగ్ చట్టానికి వ్యతిరేకంగా.. నిర్లక్ష్యంగా సీబీఐ కేసు నమోదు చేసిందని.. దీనిని కొట్టివేసి తనకు పరిహారం ఇప్పించాలంటూ శ్రీలక్ష్మీ దాఖలు చేసిన పిటీషన్ పైన హైకోర్టులో విచారణ సాగింది.
శ్రీలక్ష్మీ పై సీబీఐ అభియోగాలు
అయితే, ఈ ఆరోపణలకు ఎటువంటి ప్రత్యక్ష ఆధారాలూ లేవని ఆమె తరఫు న్యాయవాది రాఘవాచార్యులు వాదించారు.సీబీఐ తరఫు న్యాయవాది కే సురేందర్ వాదనలు వినిపించారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో పరిశ్రమలశాఖ కార్యదర్శిగా శ్రీలక్ష్మి ఉన్నారన్నారు. కేసులో ప్రధాన నిందితుడు గాలి జనార్దన్రెడ్డి, ఇతర నిందితులకు లబ్ధి చేకూర్చేవిధంగా రెండు జీవోలు జారీచేశారని కోర్టుకు నివేదించారు. అయితే శ్రీలక్ష్మి కేసు కేవలం డబ్బు తీసుకోవడానికి సంబంధించింది మాత్ర మే కాదని... ఇందులో అధికార దుర్వినియోగం సైతం ఇమిడి ఉందని వాదించా
విచారణకు అనుమతించాలని వినతి
శ్రీలక్ష్మీ తీసుకున్న నిర్ణయాలు అవినీతి నిరోధక చట్టం కింద విచారించతగ్గ నేరాలుగా పేర్కొన్నారు. విచారణ జరిగితేనే నేరం రుజువు అవుతుందని... క్వాష్ పిటిషన్ కొట్టేసి..విచారణ కొనసాగేలా అనుమతించాలని ఆయన కోర్టును కోరారు. ఈ కేసును దర్యాప్తు చేసే పరిధి సీబీఐకి ఉందో లేదో చెప్పాలని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై సీబీఐ న్యాయవాది సురేందర్ బదులిస్తూ.. ''కేసుపై దర్యాప్తు చేపట్టేందుకు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అనుమతి ఇచ్చింది. మైనింగ్, లీజులు, ఇతర అంశాలు సైతం దర్యాప్తు పరిధిలో ఉన్నాయి. కాబట్టి సీబీఐకి కేసు దర్యాప్తు చేసే పరిధి ఉందని స్పష్టంచేశారు.
Recommended Video
వాదనలు పూర్తి..తీర్పు రిజర్వ్
శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది రాఘవాచార్యులు వాదనలు వినిపిస్తూ...మైనింగ్ లీజు ఇచ్చే అంశంలో జాయింట్ డైరెక్టర్ స్థాయి నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు అన్ని స్థాయుల అధికారులు ఉన్నారని.. మరి వారందరినీ నిందితులుగా ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. ఇరుపక్షాల వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది. తీర్పు వెలువడే వరకు దిగువ కోర్టులో జరుగుతున్న విచారణపై స్టే విధించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. ఇక్కడ విచారణ జరుగుతున్నట్లుగా సీబీఐ కోర్టులో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అవసరమైతే ఇక్కడ విచారణ జరుగుతున్నట్లుగా ఉత్తర్వులు ఇస్తామని న్యాయమూర్తి స్పష్టం చేసారు. దీంతో..తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం...రానున్న రోజుల్లో ఇచ్చే తీర్పు పైన ఆసక్తి నెలకొని ఉంది.