ఎపికి ప్రత్యేక హైకోర్టు రాకకు కేంద్రం మోకాలడ్డుతోందా?...సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ పిటిషన్ దాఖలు..
హైదరాబాద్:తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ భూభాగంలోనే కొత్త కోర్టు ఏర్పాటు చేయాలన్న ఉమ్మడి హైకోర్టు మూడేళ్ల క్రితం ఇచ్చిన తీర్పుపై తాజాగా సుప్రీంకోర్టులో ప్రత్యేక సెలవు కాలీన పిటిషన్(ఎస్ఎల్పీ)ను కేంద్రం దాఖలు చేసింది.
నూతన కోర్టును ఏర్పాటుచేసేందుకు హై కోర్టు తీర్పు అవరోధంగా ఉందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు, ఉమ్మడి హైకోర్టులే నిర్ణయం తీసుకోవాలంటూ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం చెబుతూ వచ్చిన సంగతి తెలిసిందే!. అయితే కేంద్రం తాజాగా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ వెనుక ఉద్దేశ్యం ఎపికి ఉద్దేశించబడిన ప్రత్యేక హైకోర్టు కూడా ప్రస్తుతానికి హైదరాబాద్ లోనే ఏర్పాటు అయ్యేలాగా చూడటమేకావచ్చని నవ్యాంధ్ర న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
కేంద్రం...ఉద్దేశ్యం అదేనా?
ఆంధ్రప్రదేశ్ లో కొత్త హైకోర్టు ఏర్పాటు కొరకు నవ్యాంధ్ర ప్రజలు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తుండగా...మరోవైపు ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుండటం ఎపి వాసుల్లో అసంతృప్తి కలిగిస్తోంది. మరోవైపు ఉమ్మడి హై కోర్టు విభజనకు తెలంగాణ సిఎం సైతం ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి హైకోర్టును విభజించి తెలంగాణలోనే తాత్కాలిక ప్రాతిపదికన ఏపీ హైకోర్టు కూడా ఏర్పాటు అయ్యేలా చేయాలనేది కేంద్రం ఉద్దేశం కావచ్చని నవ్యాంధ్ర న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
.హైకోర్టు తీర్పు
ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ప్రత్యేక హైకోర్టు ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపై ధనగోపాలరావు అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారించిన ఉమ్మడి హైకోర్టు 2015 మే 1న తీర్పు వెలువరిస్తూ తెలంగాణ భూభాగంలో ఏపీ హైకోర్టు ఏర్పాటు సాధ్యం కాదని...ఏపీ భూభాగంలోనే ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాల్సి ఉందని తీర్పు చెప్పింది. ఇందుకోసం తాత్కాలిక ప్రాతిపదికన సర్క్యూట్ బెంచ్ల ఏర్పాటును పరిశీలించవచ్చని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఏపీ ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పరస్పరం చర్చించుకుని హైకోర్టు భవనం, పరిపాలనా భవనం, న్యాయమూర్తుల నివాసాలు, సిబ్బంది గృహ సముదాయాలు నిర్మాణాలకు అనువైన ప్రాంతాన్ని గుర్తించాలని హై కోర్టు ఆ తీర్పులో సూచించింది.
ఇలా చెబుతూ వచ్చింది
ఆ తీర్పు అనంతరం హైకోర్టు విభజన అంశంపై కేంద్రం నిర్ణయం కోసం ఎపి అడిగినప్పుడల్లా అది హైకోర్టు, ఏపీ ప్రభుత్వ నిర్ణయం పైనే ఆధారపడి ఉందంటూ కేంద్రం చెబుతూ వచ్చింది. ఆ క్రమంలో కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ పిటిషన్ దాఖలు చేయడంతో తద్వారా ఎపి ప్రత్యేక హైకోర్టు కూడా తాత్కాలిక ప్రాతిపదికన తెలంగాణ భూభాగంలోనే ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నం కావచ్చని కొందరు న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
సుప్రీం కోర్టు తీర్పే...కీలకం
అయితే తాత్కాలిక ఎపి ప్రత్యేక హైకోర్టు ఎక్కడ ఏర్పాటు కావాలనే విషయమై సుప్రీం కోర్టు నిర్ణయమే కీలకం కానుంది. మరోవైపు ఈ విషయమై తాము దాఖలు చేసిన ఎస్ఎల్పీపై అత్యవసరంగా విచారణ చేపట్టాలంటూ కేంద్ర ప్రభుత్వ న్యాయవాది ఈనెల 24న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావించడం జరిగింది. దీంతో సుప్రీం ధర్మాసనం ఆదేశాల నేపథ్యంలో కేంద్రం ఎస్ఎల్పీ ఈ వారంలో విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఏపీ ప్రభుత్వం...హైకోర్టుకు లేఖ
గతంలో ఈ విషయమై హై కోర్టు ఇచ్చిన తీర్పు క్రమంలో...నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో హైకోర్టు భవనం నిర్మాణం నవంబరులోగా పూర్తి అవుతుందని, దీనికి సంబంధించి కంప్యూటర్లు, ఇంటీరియర్ అవసరాలు ఏమిటో చెబితే వాటిని సమకూరుస్తామని ఏపీ ప్రభుత్వం ఇటీవలే ఉమ్మడి హైకోర్టుకు లేఖ రాసింది. ఆ లేఖలో హైకోర్టు సూచించిన ఏర్పాట్లన్నీ డిసెంబరులోగా పూర్తవుతాయని ఎపి ప్రభుత్వం పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం రాసిన లేఖపై ఉమ్మడి హైకోర్టు స్పందిస్తూ భవనాలు, ఏర్పాట్ల పరిశీలనకు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ సి.ప్రవీణ్కుమార్, జస్టిస్ పి.నవీన్రావులతో కమిటీని నియమించింది. ఈ క్రమంలోనే సుప్రీం తాజా పిటిషన్ దాఖలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.