రాష్ట్రానికి గృహ శోభ- వైఎస్ జగన్ శ్రీకారం
కాకినాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నవరత్నాల్లో కీలకమైనది- అందరికీ ఇళ్లు. ఈ పథకంలో భాగంగా 31 లక్షల ఇళ్ల నిర్మాణాలను ఇదివరకే చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. జగనన్న కాలనీల పేరుతో గ్రామాలకు గ్రామాలే నిర్మితమౌతోన్నాయి.
అందులో ఒకటి- కాకినాడ జిల్లా సామర్ల కోట. ఇక్కడ నిర్మించిన జగనన్న కాలనీని వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. అయిదు లక్షల గృహాలు ఈ కాలనీలో ఉన్నాయి. లబ్దిదారులకు ఇళ్లను అందజేయనున్నారాయన. ఈ కార్యక్రమాన్ని పండగలా నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.

రాష్ట్రంలో సొంత ఇల్లు లేనివాళ్లు ఉండరాదన్నది సీఎం వైఎస్ జగన్ సంకల్పం. ప్రతి చెల్లీ, ప్రతి అక్కా తన పిల్లాపాపలతో సొంత ఇంటిలో ఉండాలని, దానికి తనవంతుగా గొప్ప సాయం అందించాలని నిర్ణయించారు. దాన్ని ఆచరణలోకి పెట్టారు. అందులో భాగంగా 30.75 లక్షల మందికి 76,000 కోట్ల విలువైన ఇళ్ల స్థలాలకు సంబంధించి పట్టాలు అందజేశారు.

ఇక రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 21.76 లక్షల గృహాలు నిర్మించడానికి 56,700 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని లెక్క వేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వం చేసిన నిర్వాకాల వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ అయినప్పటికీ- ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినప్పటికీ పేదలందరికీ ఇళ్లను ఇవ్వాలనే సంకల్పం, ఇచ్చి తీరాలన్న దృఢచిత్తం ఉండటంతో అలాంటి అడ్డంకులేవీ జగన్ను ఆపలేకపోయాయి.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాదిగా జగనన్నకాలనీల కోసం స్థలసేకరణ జరిగింది. అక్కడ ఇళ్ళు నిర్మించేందుకు వీలుగా రోడ్లు, నీళ్లు, విద్యుత్, పార్కుల వంటి మౌలిక సదుపాయాలు సమకూర్చారు. దీంతో ఇళ్ల నిర్మాణం మొదలవుతోంది. ఒక్కొక్కరూ తమకు ఇచ్చిన జాగాలో ప్రభుత్వ సాయంతో ఇల్లు కట్టుకుంటున్నారు.

ఎంత తక్కువగా లెక్కేసినా ఒక్కో ఇంటి ధర ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం 15 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. అంటే వైఎస్ జగన్ ఆలోచనలు వాస్తవరూపం దాలుస్తుండడంతో రాష్ట్రంలో పేదల జీవన స్వరూపమే మారుతోంది. ఇళ్లు లేని పేదలు ఇక మీదట ఆత్మగౌరవంతో సొంత ఇంట్లో ఉండొచ్చు.
రాష్ట్రంలో ఓ ఉద్యమం మాదిరిగా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న అధికారులు అటు లబ్ధిదారులకు అన్నిరకాలుగా తోడ్పాటును అందిస్తోన్నారు. ఇటుక, సిమెంట్, కంకర, ఇనుము.. వంటి నిర్మాణ సామాగ్రితో పాటు తలుపులు, గుమ్మాలు, కిటికీలు సైతం సమకూరుస్తూ నిర్మాణం త్వరగా అయ్యేలా చూస్తున్నారు.
ఇప్పటికే ఈ పథకం కింద 5.24 లక్షల గృహాలు పూర్తవగా వాటిని నేడు లబ్ధిదారులకు అందజేస్తారు. ఈ క్రమంలో దాదాపు 2,412 ఇళ్లను పూర్తి చేసుకున్న సామర్లకోట పట్టణంలో లబ్ధిదారుల సామూహిక గృహప్రవేశాలకు వైఎస్ జగన్ హాజరవుతున్నారు. ఆ కాలనీల్లో ఇప్పటికే పార్కులు, రోడ్లు, తాగునీరు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించిన ప్రభుత్వం అక్కడ నివాసానికి సకలం సమకూర్చింది.












Click it and Unblock the Notifications