దిగ్విజయ్ మద్దతు వెనక ఏమిటి?: జగన్కు కాంగ్రెస్ దగ్గరువుతోందా?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి దగ్గర కావాలని కాంగ్రెసు అధిష్టానం తాపత్రయపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మట్టి కొట్టుకుపోయిన పార్టీని తిరిగి లేపడం అంత సులభంగా కనిపించడం లేదు. దీంతో వైయస్ జగన్మోహన్ రెడ్తితో కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
ఆ కారణంగానే వైయస్ జగన్ దీక్షకు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ ఇటీవల మద్దతు తెలుపుతూ ప్రకటన చేశారని అంటున్నారు. జగన్తో అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ ఆయన దీక్షకు మద్తతు తెలుపుతున్నట్లు డిగ్గీ రాజా ప్రకటించారు. అయితే, జగన్ దీక్షను పోలీసులు భగ్నం చేసిన తర్వాత ఆయన మద్దతు ప్రకటించడం కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే, జగన్తో భవిష్యత్తులో కలిసి పని చేసే ఉద్దేశంతోనే ఆయన ఆ ప్రకటన చేసినట్లు భావిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తమ జగన్ దీక్షకు సంఘీభావం ప్రకటించారు. జగన్తో రాజకీయపరంగా విభేదాలు ఉన్నప్పటికీ ఏపీకి ప్రత్యేక హోదా దక్కించుకునేందుకు చేసే పోరాటానికి తమ వంతు మద్దతు ఇస్తామని కాంగ్రెస్ నేతలు బాహాటంగానే ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే వివిధ రకాల ఆందోళన కార్యక్రమాలకు తమ వంతు మద్దతు ప్రకటిస్తామని ప్రకటించారు.
భవిష్యత్తులో కూడా వైయస్ జగన్ చేపట్టే ఆందోళనా కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర నాయకులకు సూచించినట్లు తెలుస్తోంది. నిజానికి, మొదటి నుంచి దిగ్విజయ్ సింగ్ జగన్ పట్ల కాస్తా సానుకూల వైఖరితోనే ఉన్నారు. జగన్ తమ డిఎన్ఎనే అని ప్రకటించి ఆయన గతంలో దుమారం రేపారు.
రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఒక్కరే కాంగ్రెసులో జనాకర్షణ నేతగా పరిగణనలోకి వస్తున్నారు. అయితే చిరంజీవి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ పార్టీని ముందుకు నడిపించే బాధ్యతను తీసుకునే పరిస్థితిలో లేరని అంటున్నారు. ఆయన తన 150వ సినిమాను పూర్తి చేయడానికి సమయం తీసుకోవడం వల్లనే ఆయన అందుకు సిద్ధంగా లేరని అంటున్నారు. ఈ స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి, బిజెపి కూటమిని ఎదుర్కోవడానికి జగన్తో కలిసి పనిచేయడం అవసరమని కాంగ్రెసు నాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications