అమరావతి కేసులపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం..!!
అమరావతి కేసులకు సంబంధించి సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
అమరావతి కేసులకు సంబంధించి సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ రాజధాని అంశానికి సంబంధించిన కేసు త్వరగా విచారించాలని ఏపీ ప్రభుత్వం మరోసారి సుప్రీంను అభ్యర్ధించింది. ఏపీ ప్రభుత్వ అభ్యర్ధన పైన సుప్రీం ధర్మాసనం తమ నిర్ణయం స్పష్టం చేసింది. గత సోమవారం ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అమరావతి కేసులను విచారించాలని కోరింది. దీనిని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఈ నెల 28న విచారణకు నిర్ణయించింది. కాగా, మరోసారి ఏపీ ప్రభుత్వం ఈ రోజు సుప్రీంకోర్టులో మరోసారి అభ్యర్ధన ధర్మాసనం ముందు ఉంచింది. విచారణ సాధ్యమైనంత త్వరగా చేయాలని ప్రభుత్వ తరపున న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. అయితే, 28వ తేదీనే అమరావతి కేసు విచారిస్తామని న్యాయమూర్తి కె ఎం జోసెఫ్ ధర్మాసనం స్పష్టం చేసింది.
సుప్రీం ధర్మాసనం ఇప్పటికే నిర్ణయించిన విధంగా ఈ నెల 28న అమరావతి కేసుల విచారణ చేపడతామని వెల్లడించింది. దీంతో, 28న ఒక్క రోజు మాత్రమే కాకుండా కొనసాగింపుగా ఈ నెల 29, 30 తేదీల్లోనూ విచారణ కొనసాగించాలని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోరారు. అమరావతి కేసు చాలా పెద్దదని.. విచారణ చేపడితే సార్ధకత ఉండాలని న్యాయమూర్తి కె ఎం జోసెఫ్ వ్యాఖ్యానించారు. ఇందులో అనేక అంశాలు ఇమిడి ఉన్నాయని పేర్కొన్నారు. అదే సమయంలో తమ అభ్యర్ధనను ప్రధాన న్యాయమూర్తి ముందు ప్రత్యేకంగా ప్రస్తావించేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ న్యాయవాదులు కోరారు. ఆ విధంగా అనుమతి ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది.

సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో ఈ నెల 28నే అమరావతి కేసుల విచారణ జరగనుంది. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం చేసింది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వటంతో..ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. దీనిని విచారించిన సుప్రీంకోర్టు హైకోర్టు అమరావతి నిర్మాణ గడువు పైన విధించిన కాలపరమితితో పాటుగా పలు మరి కొన్ని అంశాల అమలు పైన స్టే ఇచ్చింది. తదుపరి విచారణకు కేసు వాయిదా వేసింది. ఇప్పుడు ఈ విచారణను వేగవంతం చేయాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. ఏపీలో ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ..సుప్రీంకోర్టులో కేసు పరిష్కరించుకొని విశాఖ నుంచి పాలన ప్రారంభిచాలనేది ఏపీలోని అధికార పార్టీ ముఖ్య నేతల ఆలోచన. కానీ, ఇప్పుడు సుప్రీంకోర్టు ముందుగా తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నెల 28న విచారణ చేపట్టనుంది. దీంతో..సుప్రీం విచారణ కోసం ఏపీ ప్రభుత్వం వేచి చూస్తోంది.












Click it and Unblock the Notifications