మద్యం కేసులో ఆ ముగ్గురి అరెస్ట్, బెయిల్ పై సుప్రీం కీలక ఆదేశాలు..!!
మద్యం కేసులో ముగ్గురు నిందితుల బెయిల్ పిటీషన్ పై సుప్రీంలో విచారణ జరిగింది. సుప్రీం కీలక సూచనలు చేసింది. నిందితులు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ, రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని స్పష్టం చేసింది. అదే సమయంలో అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ మరో నెల రోజుల పాటు కొనసాగిస్తూ రిలీఫ్ ఇచ్చింది. గతంలో వీరి విషయంలో హై కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
ఏపీ లిక్కర్ కేసులో డిఫాల్ట్ బెయిల్ పైన కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప బయటకు వచ్చారు. అయితే, ట్రయల్ కోర్టు మంజూరు చేసిన డీఫాల్ట్ బెయిల్ను రద్దుచేస్తూ.. హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. దీని పైన ఈ ముగ్గురూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, ఈ కేసు నేడు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో తాము జోక్యం చేసుకోలేమని ఈ మేరకు ధర్మాసనం స్పష్టం చేసింది. నిందితులు తమకు బెయిల్ కావాలంటే సంబంధిత ట్రయల్ కోర్టులోనే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసుకోవాలని ఆదేశించింది. కాగా.. ఈ కేసులో నిందితులకు తక్షణమే అరెస్ట్ ముప్పు లేకుండా కొంత ఉపశమనం కలిగిస్తూ సుప్రీం కోర్టు స్పష్టత ఇచ్చింది. గతంలో (నవంబర్ 26న) సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర రక్షణ ఉత్తర్వులు ప్రస్తుతం కొనసాగుతాయని తెలిపింది.

అదే సమయంలో ఒకవేళ ట్రయల్ కోర్టులో బెయిల్ రాకపోతే.. తిరిగి హైకోర్టును ఆశ్రయించేందుకు వీలుగా నిందితులకు నాలుగు వారాల పాటు మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా ఈ ముగ్గురికి నెల రోజుల పాటు వారికి అరెస్ట్ నుంచి రక్షణ కొనసాగనుంది. లిక్కర్ కేసులో దర్యాప్తు సంస్థలు నిర్దేశిత సమయంలో ఛార్జ్ షీటు దాఖలు చేయకపోవటంతో విచారణ కోర్టు ఈ ముగ్గురికి గతంలో డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. దీనిపై ఏపీ ప్రభుత్వం(సిట్) హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారణ చేసిన హైకోర్టు ఆ డీఫాల్ట్ బెయిల్ను రద్దు చేసింది. దీని పైన ఆ ముగ్గురు సుప్రీంను ఆశ్రయించగా.. ఇప్పుడు ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.












Click it and Unblock the Notifications