జగన్ టూర్లో జేబుదొంగ: వర్షంలో లోకేష్ కోసం నిరీక్షణ
రాజమండ్రి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు ఉదయం ప్రాజెక్టు యాత్రను ప్రారంభించారు. తూర్పు గోదావరి జిల్లాలో ఆయన యాత్ర ప్రారంభమైంది. రాజమండ్రి నుండి ఆయన బస్సుయాత్ర ప్రారంభమైంది.
ఆయన బుధవారం ఉదయం హైదరాబాదు నుండి విమానంలో మధురవాడ విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుండి నేరుగా దవేళేశ్వరం బ్యారేజ్ వద్దకు వెళ్లారు. జగన్తో పాటు పలువురు నేతలు ఉన్నారు. ప్రాజెక్టు యాత్రలో భాగంగా జగన్, పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టు ప్రాంతాలను సందర్శిస్తారు.
జగన్ పర్యటనలో జేబుదొంగలు
వైయస్ జగన్ పర్యటనలో జేబు దొంగలు తమ చేతివాటం చూపించారు. ఓ దొంగ జగన్ పర్యటనలో భారీగా చేరిన జన సమూహంలో దొంగతనానికి పాల్పడ్డారు. అతనిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పట్టుకొని చితకబాదారు.
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ పర్యటనలోను మంగళవారం నాడు దొంగలు చేతివాటం చూపిన విషయం తెలిసిందే. సదరు బాధిత టీడీపీ నేత పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
వర్షంలోను లోకేష్ కోసం ఎదురుచూపు
నారా లోకేష్ మంగళవారం నాడు చిత్తూరు జిల్లాలో కార్యకర్తల సంక్షేమ యాత్రను ప్రారంభించారు. పుంగనూరు బంగారుపాలెంలో మంగళవారం సాయంత్రం ప్రజలు జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ.. ఆ వర్షంలోను లోకేష్ కోసం ఎదురు చూశారు. బుధవారం ఉదయం లోకేష్ రైల్వేకోడూరులో యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్తను ఆదుకుంటామని చెప్పారు.