ఏపీ రాజధానిపై నరేంద్ర మోడీతో చర్చించా: జగన్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ విమర్శలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడో ఒకచోట మాత్రమే పెట్టాలనేదే తమ డిమాండ్ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమ నుంచి ఇప్పటి వరకు వలసలు ఎందుకున్నాయి? అని ప్రశ్నించారు. కడపలో ఉక్కు పరిశ్రమ కూడా రాయలసీమ ప్రజలను మభ్యపెట్టేందుకేనని అన్నారు.

అందుకేనా జగన్..
జనసేన ఎప్పటికీ ప్రజల పక్షమేనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల కోసం ఎవరితోనైనా పోరాటం చేస్తామని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అమరావతి రైతులకు అండగా ఉంటామని, రైతులు తమ భూములను ఐదుకోట్ల ఆంధ్రులకు ఇచ్చారని అన్నారు. రాజధాని ఎక్కడో ఒకచోట పెట్టాలనేదే తమ డిమాండ్ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసమేనా ఈ చర్యలు? అని జగన్ సర్కారును పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. నవరత్నాలు కూడా సరిగా అమలు చేయలేదు.. అందుకే ఇవన్నీ చేస్తున్నారనే అనుమానం కలుగుతోందని అన్నారు. రాజధానిపై చర్చ కాదు.. ముందు రైతులకు న్యాయం చేయాలని అన్నారు. ప్రజలను విడగొట్టి పాలిస్తామంటే ఊరుకునేది లేదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు.

నరేంద్ర మోడీని కలిసి..
గతంలో ప్రధాని నరేంద్ర మోడీని గాంధీనగర్లో కలిశానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం తమ పార్టీ సిద్ధాంతమని ఆయనతో చెప్పినట్లు తెలిపారు. జిల్లాలు, ప్రాంతాలు అని కొట్టుకుంటూ పోతే భారతీయత పోతుందని ఆయనతో తెలిపినట్లు చెప్పారు. ఇది మన శత్రుదేశాలైన పాక్, చైనాలకు అనుకూలంగా మారే అవకాశముందని చెప్పినట్లు తెలిపారు.

ఏపీ రాజధానిపై మోడీ ఇలా..
ఆ సమయంలోని ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంపై కూడా నరేంద్ర మోడీతో చర్చించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ముంబై నుంచి గుజరాత్ రాష్ట్రంగా విడిపోయినప్పుడు తాము గాంధీనగర్ను రాజధానిగా చేసుకున్నట్లు మోడీ తనకు చెప్పినట్లు తెలిపారు. ‘మీకు బలమైన ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావాలి. అన్ని ఒకే చోట ఉండాలి. నేను కూడా ఏపీకి అండగా ఉంటా' అని నరేంద్ర మోడీ తనతో చెప్పారని పవన్ తెలిపారు. గాంధీనగర్ను కూడా ఒకసారి చూసి వెళ్లండి అని మోడీ తనకు సూచించారని పవన్ చెప్పారు. తన ఆవేదనను మోడీ సంపూర్ణంగా అర్థం చేసుకున్నారని తెలిపారు.

ఎన్నికల ప్రచారంలోనూ.. రాజధానిపై మోడీ సూచనలు
2014 ఎన్నికల ప్రచార సమయంలో కూడా రాజధానిపై చర్చ జరిగిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు, తిరుపతి, ఒంగోలు లాంటి ప్రాంతాలు రాజధాని అయితే బాగుంటుందని అనుకున్నట్లు చెప్పారు. వీటిలో ఏదైనా ఒక ప్రాంతంలో రాజధాని ఉండాలని అనుకున్నట్లు తెలిపారు. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీ, ప్రతిపక్ష పార్టీలతో కలిసి రాజధానిపై చర్చించుకోవాలని నరేంద్ర మోడీ సూచించారని పవన్ కళ్యాణ్ తెలిపారు.

అప్పుడు ఎవరికీ కోపాలు తాపాలు లేవు..
ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో టీడీపీ-బీజేపీ ప్రభుత్వం ఏర్పడిందని చెప్పిన పవన్ కళ్యాణ్.. రాజధానిగా అమరావతిని నిర్ణయించారని తెలిపారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ రెడ్డి కూడా అమరావతిని రాజధానిగా స్వాగతించారని గుర్తు చేశారు. అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు ఏ ప్రాంతం వారికీ కోపాలు తాపాలు లేవు అని పవన్ చెప్పారు. ఇప్పుడు మూడు రాజధానులంటూ జగన్ సర్కారు ప్రజల మధ్య చిచ్చు పెట్టిందని మండిపడ్డారు. రాజధాని ఒకే ప్రాంతంలో ఉండాలని, అభివృద్ధి మాత్రం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో జరగాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications