అందరి టార్గెట్ విజన్ 2050: చంద్రబాబు-జగన్లది ఒకేమాట, మరోదారిలో పవన్ కళ్యాణ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఏపీలో గెలుపుపై మొదటి మూడు పార్టీలు ధీమాగా ఉన్నాయి. ఒకవేళ గెలవకపోయినప్పటికీ చక్రం తిప్పుతామనే అభిప్రాయంలోను జనసేన ఉంది. ఈసారి రంగంలోకి జనసేన కూడా రావడంతో ఈ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి.
'అఖిలప్రియ తెలుసుకోవాల్సింది చాలా ఉంది, ఈ విషయం చంద్రబాబు వద్దకు వెళ్లింది'
ఈ నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, వైయస్ జగన్, పవన్ కళ్యాణ్లు ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేతలు అందరు కూడా దాదాపు పాతికేళ్లు, ముప్పై ఏళ్లు అని గుర్తు చేసుకుంటున్నారు. అధికారంలో ఉండటం కావొచ్చు.. రాజకీయాలు కావొచ్చు.. పై వ్యాఖ్యల గురించి పదేపదే ప్రస్తావిస్తున్నారు.
టీడీపీ విజన్ 2050
చంద్రబాబు నాయుడు 1996 - 2004 మధ్య సమైక్య ఏపీ సీఎంగా ఉన్నప్పుడు విజన్ 2020ను తెరపైకి తెచ్చారు. విభజన అనంతరం 2014లో అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలు విజన్ 2050 గురించి మాట్లాడుతున్నారు. గతంలో ఓ మహానాడులో చంద్రబాబు మాట్లాడుతూ... 2050 వరకు ఏపీలో టీడీపీయే అధికారంలో ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత తెలుగు తమ్ముళ్లు కూడా అదే నినాదాన్ని అందుకున్నారు. మొత్తానికి ఏపీలో ఇప్పుడు ఉన్న టర్మ్ కాకుండా మరో ముప్పై ఏళ్లు టీడీపీయే అధికారంలోకి వస్తుందని అంటున్నారు.
వైయస్ జగన్ ముప్పై ఏళ్లు
ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా 'ముప్పయ్యేళ్ల' మాటలే మాట్లాడుతున్నారు. తనకు డబ్బు పైన వ్యామోహం లేదని, తనకు ఉన్న వ్యామోహం, ఆశ అంతా ఇప్పుడు అధికారంలోకి వచ్చాక.. ప్రజలకు మంచి చేయాలని, ఆ తర్వాత ముప్పై ఏళ్లు అధికారంలో ఉండేలా ప్రజలకు మేలు చేయాలనేది తన కోరిక అని, తాను చనిపోయాక ఏపీ ప్రజలు తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఫోటోలను ఇంట్లో పెట్టుకున్నట్లుగా తన ఫోటో పెట్టుకోవాలనేది తన కోరిక అని అంటున్నారు. తద్వారా జగన్ కూడా 2050 వరకు తాను అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ కూడా అదే మాట కానీ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాతికేళ్లు, ముప్పై ఏళ్లు అంటున్నారు. కానీ వారికి భిన్నంగా ఈయన చెబుతున్నారు. తాము మరో ముప్పై ఏళ్లు అధికారంలో ఉండాలని టీడీపీ, వైసీపీలు కోరుకుంటే, జనసేనాని మాత్రం మరో ఇరవై అయిదేళ్లు రాజకీయాల్లో ఉండేందుకు వచ్చానని, ఇలా వచ్చి ఆలా వెళ్లిపోయేందుకు రాలేదని చెబుతున్నారు. ఏపీకి చెందిన ముఖ్య నేతలు మొత్తానికి అటు ఇటుగా విజన్ 2050 పెట్టుకున్నారని చెప్పవచ్చు.