సౌదీలో ఉద్యోగమని.. స్త్రీలను వ్యభిచార కూపంలోకి
నెల్లూరు: సౌదీ అరేబియాలోని ధనవంతుల ఇళ్లల్లో పనికి కుదుర్చుతానని చెప్పి, అమాయక యువతులను, మహిళలను వ్యభిచార కూపంలోకి దించుతున్న శారదా అలియాస్ రాణి అనే ఓ మహిళా ఏజెంట్ను, ఆమె భర్త వెంకటేశ్వర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని ఇనమడుగు గ్రామానికి చెందిన నిందితురాలికి చాలా పేర్లతో, పలు ప్రాంతాల్లో పాస్పోర్టులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఆమెపై 2014లోనే పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసు విచారణ చేపట్టిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. రాణికి సహకరిస్తున్న నిరంజన్ బాబా అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కాగా, ఆమె వెనుక ఏదైనా ముఠా ఉందా? ఎవరెవరితో సంబంధాలున్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పేదరికంలో ఉన్న మహిళల అవసరాలను ఆసరాగా చేసుకుని నిందితురాలు వాళ్లను సౌదీకి పంపిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రూ. 25 వేల నుంచి 30వేల వరకు జీతాలు ఇప్పిస్తామని నమ్మించి దాదాపు 30మందికిపైగా మహిళలను గల్ఫ్ దేశాలకు పంపించినట్లు తెలిపారు.
కాగా, పని కోసం వెళ్లిన మహిళలో ఓ మహిళను అక్కడి వ్యక్తులు రూ. 2లక్షలకు మరొకరికి అమ్మేశారని, ఈ విషయం స్థానిక బంధువులకు బాధిత మహిళ తెలిపింది. దీంతో మొత్తం వ్యవహారం బయటికి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితులు రాణి, వెంటేశ్వర్లు, నిరంజన్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కిరోసిన్పోసుకుని నిప్పంటించుకున్న యువతి
శ్రీకాకుళం: ఓ యువతి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. జిల్లాలోని ఇచ్ఛాపురం మండలం, సోంపేటలో ఈ ఘటన జరిగింది. సోంపేటలోని శ్రీసైన వీధిలో నివాసముండే ప్రశాంతి(20) అనే యువతి ఆత్మహత్యకు యత్నించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. విషయం గమనించిన స్థానికులు యువతిని వెంటనే ఆస్పత్రికి తరలిచారు. ఆ యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.