తిరుమల శ్రీవారి గరుడ వాహన సేవకు వేళాయే!
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 8వ తేదీ సాయంత్రం శ్రీ మలయప్ప స్వామి విశేషమైన గరుడ వాహనంపై సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విహరిస్తారని టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. ఎంతో ప్రత్యేకంగా జరిగే గరుడ వాహనసేవకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.
శ్రీవారి గరుడ వాహన సేవ
తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన ఈవో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి గరుడ వాహన సేవకు భక్తుల రద్దీ పెరిగిందని ఆయన పేర్కొన్నారు. దాదాపు 2 లక్షల మంది భక్తులు గ్యాలరీల్లో వేచి ఉంటారనీ, గరుడ సేవ దర్శనం కోసం వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు.

భక్తుల దర్శనానికి ఏర్పాట్లు
తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్రవాహనాల రాకపోకలను అక్టోబరు 7వ తేదీ రాత్రి 9గంటల నుండి అక్టోబరు 9వ తేదీ ఉదయం 6గంటల వరకు రద్దు చేసినట్టు తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్లలో వేచి ఉండే భక్తులను సుపథం, సౌత్ వెస్ట్ కార్నర్, గోవిందనిలయం నార్త్ వెస్ట్ గేట్, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా దర్శనం కల్పిస్తామన్నారు.
భక్తుల కోసం ఆర్టీసీ సేవలు
భక్తుల సౌకర్యార్థం అన్ని పాయింట్ల వద్ద అవసరమైన సైన్ బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భక్తులు లగేజీని తీసుకెళ్లకుండా ఈ పాయింట్లలోకి ప్రవేశించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.భక్తుల భద్రత దృష్ట్యా తిరుమలలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ప్రజారవాణాను వినియోగించుకోవాలని కోరారు.ఆర్టిసి బస్సుల్లో దాదాపు 3 వేల రౌండ్ ట్రిప్పుల ద్వారా దాదాపు 3 లక్షల మందిని తరలించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.
పార్కింగ్ స్థలాలను గుర్తించేందుకు క్యూఆర్ కోడ్ లు
తిరుపతి, కడప, చిత్తూరు, శ్రీకాళహస్తి రూట్లలో కూడా పార్కింగ్ స్థలాల నుంచి తిరుమలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. పార్కింగ్ స్థలాలను సులభంగా గుర్తించడానికి క్యూఆర్ కోడ్లను కూడా అందిస్తున్నామన్నారు.తిరుమలలోని బాలాజీనగర్, కౌస్తుభం ఎదురుగా, రాంభాగీచా బస్టాండ్, ముళ్లగుంట ప్రాంతాల్లో దాదాపు 25 చోట్ల 9 వేల వాహనాలకు సరిపడా పార్కింగ్ ఏర్పాట్లు చేశామన్నారు.
మెడికల్, సెక్యూరిటీ ఏర్పాట్లు ఇలా
గరుడ సేవను పర్యవేక్షించేందుకు 1250 మంది టీటీడీ నిఘా మరియు భద్రతా సిబ్బంది, 5 వేల మంది పోలీసులతో పాటు ఆక్టోపస్, గ్రే హౌండ్స్ బృందాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు వైద్య సేవల కోసం మాడ వీధుల్లో నాలుగు మూలల్లో మొబైల్ క్లినిక్లు, 12 అంబులెన్స్లు, వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.












Click it and Unblock the Notifications