ఏపీకి హెచ్చరిక: దూసుకొస్తున్న వాయుగుండం
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి 15 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా దూసుకొస్తోంది. ఇప్పటికే దీని ప్రభావంతో రాయలసీమలోని అన్ని జిల్లాల్లో, దక్షిణ కోస్తాలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. భారత వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం ఈ వాయుగుండం నెల్లూరుకు 370 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 280 కిలోమీటర్ల దూరంలో, పుదుచ్చేరికి 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. వాయుగుండంప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు.
సిద్ధంగా బృందాలు
ఇప్పటికే వరదలతో అల్లాడిపోతున్న ఏపీకి తాజా వాయుగుండం ప్రభావంతో కురిసే వర్షాలవల్ల చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. మరికొన్ని ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.

చంద్రబాబు ఆదేశాలు
అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీచేశారు. పెన్నా నదీ పరీవాహక ప్రాంత ప్రజలకు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రోజువారీ కూలిపనులు దెబ్బతిని ఆదాయం రావడంలేదు. మరోవైపు మత్స్యకారులు ఇళ్లకే పరిమితం అయ్యారు. సముద్రంలో చేపలవేటకు వెళ్లొద్దంటూ ఇప్పటికే వారికి అధికారులు హెచ్చరికలు జారీచేశారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వరద ముప్పు తప్పదనే భయంతో తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంతాలకు చెందిన ప్రజలు భయపడుతున్నారు.












Click it and Unblock the Notifications