తిరుపతిలో శ్రీవారి ట్రయల్ రన్ సక్సెస్ఫుల్
TTD: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి రానుండటంతో దీనికి అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లను చేపట్టారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు.
తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నవంబర్ 28వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 6వ తేదీ వరకు కొనసాగుతాయి. మొదటి రోజున చిన్నశేష వాహనంపై అమ్మవారు ఊరేగుతారు. 29న పెదశేష వాహనం, హంసవాహనం, 30న ముత్యాలపందిరి, సింహ వాహనం, డిసెంబర్ 1న కల్పవృక్ష వాహనం, హనుమద్వాహన సేవలు జరుగుతాయి.

2న పల్లకి ఉత్సవం, గజవాహనం, 3వ తేదీన బంగారు రథంపై అమ్మవారిని ఊరేగిస్తారు. సాయంత్రం గరుడ వాహనంపై దర్శనం ఇస్తారు. 4న సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలను నిర్వహిస్తారు. 5వ తేదీన రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం అశ్వవాహనం, 6న తిరుచ్చి ఉత్సవం, పంచమీ తీర్థాన్ని జరుపుతారు. అదే రోజు సాయంత్రం ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
బ్రహ్మోత్సవాల కోసం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుచానూరుకు వస్తారని టీటీడీ అధికారులు అంచనా వేస్తోన్నారు. దీనికి అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తోన్నారు.
చివరిరోజైన పంచమితీర్థం నాడు అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాదిమంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పంచమితీర్థం రోజున భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు అదనపు సిబ్బందిని నియమించేలా చర్యలు తీసుకున్నారు.
పంచమి తీర్థానికి తిరుమల నుంచి శ్రీవారి సారెను పద్మావతి అమ్మవారికి పంపించడం ఆనవాయితీగా వస్తోంది. ఏనుగుపై ఊరేగింపుగా దీన్ని తిరుచానూరు అమ్మవారి ఆలయానికి తీసుకొస్తారు అధికారులు. అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
శ్రీవారి సారె ఊరేగింపు ట్రయల్ రన్ను ఆదివారం నిర్వహించారు. తిరుపతిలోని చెన్నారెడ్డి కాలనీలో గల శ్రీవినాయక స్వామివారి ఆలయం నుంచి శ్రీవారి సారె ఊరేగింపు ట్రయల్ రన్ ఆరంభమైంది. అక్కడి నుంచి ఏనుగులపై సారెను ఊరేగింపుగా తీసుకొచ్చారు.
శ్రీ కోదండరామాలయం, చిన్నబజారు వీధి, పాత హుజుర్ ఆఫీస్, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీఆంజనేయస్వామివారి ఆలయం, బండ్ల వీధి, ఆర్టీసీ బస్టాండు, పద్మావతిపురం, మార్కెట్ యార్డ్, శిల్పారామం మీదుగా తిరుచానూరులోని పసుపు మండపం వద్దకు చేరుకున్నారు.
పసుపు మండపం దగ్గరి నుంచి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్దకు మేళతాళాలతో చేరుకున్నారు. ఆలయం నాలుగు మాడ వీధుల గుండా శ్రీవారి సారెను పుష్కరిణి వద్ద గల మండపానికి వేంచేపు చేశారు. దీనితో ట్రయల్ రన్ పూర్తయింది. పంచమీ తీర్థం నాడు ఇదే మార్గంలో ఊరేగింపు ఉంటుంది.












Click it and Unblock the Notifications