''ట్రై చేశావుగా...'' చిరంజీవిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్!!
కథానాయకుడు చిరంజీవిపై ప్రస్తుతం వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ జరుగుతోంది. చిరంజీవిని నెటిజన్లు రెండురకాలుగా వర్గీకరించారు. దీనంతటికి కారణం ఏమిటంటే.. అల్లు రామలింగయ్య 100వ జయంతి సందర్భంగా ఆయన పేరుమీద నిర్మించిన అల్లు స్టూడియోను చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అల్లు అరవింద్ ఈ స్టూడియోను నిర్మించారు. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలమీదే అభిమానులు ట్రోలింగ్ చేస్తున్నారు.

ట్రై చేశావని నన్ను అడగొద్దు.. ప్లీజ్!
ప్రసంగంలో భాగంగా చిరంజీవి తన రాజకీయ రంగ ప్రవేశం గురించి వ్యాఖ్యలు చేశారు. సినిమా రంగంలో ఉన్నప్పుడు వేరే వ్యాపారాలు కానీ వేరే వ్యాపకాలు కానీ పెట్టుకోకూడదని, సినిమానే లోకంగా జీవించాలని సూచించారు. ఇది చెబుతున్నందుకు మీరు నన్ను పాలిటిక్స్ లో ట్రై చేశావుకదా అని అడగొద్దు.. ఎందుకంటే మధ్యలో ఏదో ట్రై చేశాను వదిలేయండి అన్నారు. చిరంజీవి చేసిన వ్యాఖ్యలను కొందరు సరదాగా తీసుకున్నారు.. మరికొందరు సీరియస్గా తీసుకున్నారని తర్వాత అతనిమీద జరుగుతున్న ట్రోలింగ్ను బట్టి అర్థమవుతోంది.

కేంద్ర మంత్రిగా మూడు సంవత్సరాలు!
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటుచేసి 2009 ఎన్నికల్లో పోటీచేశారు. అయితే 294 శాసనసభ స్థానాలున్న ఉమ్మడి ఏపీలో 18 ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకున్నారు. తిరుపతి, పాలకొల్లు నుంచి పోటీకి దిగిన చిరంజీవి తన సొంత నియోజకవర్గం పాలకొల్లులో ఓటమి పాలయ్యారు. తిరుపతిలో గెలిచి పరువు నిలుపుకున్నారు. అయితే పార్టీ ఏర్పాటు చేసిన రెండు సంవత్సరాలకు కాంగ్రెస్ పార్టీలో దాన్ని విలీనం చేశారు. తర్వాత కేంద్ర మంత్రిగా మూడు సంవత్సరాలు పదవి అనుభవించారు.

తిట్టినవారితోనే పదవిని పంచుకున్నారు?
ఎటువంటి ప్రణాళిక లేకుండా నేరుగా ఎన్నికల్లోకి దిగారని, ఒక వైఫల్యం ఎదురవగానే పంచెలు తడుస్తాయంటూ అప్పటివరకు తట్టిపోసిన కాంగ్రెస్ నాయకులతో సఖ్యత కుదుర్చుకొని కేంద్ర మంత్రి పదవిని అనుభవించారని, పార్టీని దీర్ఘకాలం నడపలేక కాంగ్రెస్ లో విలీనం చేశారని ట్రోలింగ్ చేస్తున్నారు. మంత్రి పదవి అనుభవించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి, రాజకీయాలకు ముఖం చాటేశారని, ఆ ప్రస్తావన ఎప్పుడు వచ్చినా తప్పించుకొని తిరుగుతున్నారంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. తమ్ముడు పట్టుదలగా పార్టీని నడుపుతున్నాడని, తన సొంత డబ్బు ఖర్చుచేస్తున్నాడని, ఆయనెందుకు నడపలేకపోయారని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ మంచి చెప్పాలనుకున్నప్పటికీ అది ఎదురు తిరిగి చిరంజీవికే మైనస్ గా మారింది. అందుకే సమసయం, సందర్భం చూసి పెద్దవారు మాట్లాడాలంటారు. పలువురు అయ్యో పాపం చిరంజీవి అంటున్నారు.












Click it and Unblock the Notifications