టీఆర్ఎస్ ఓ అద్దె ఇల్లు: నగరి నుంచి పోటీ చేయడంపై సీపీఐ నారాయణ క్లారిటీ
చిత్తూరు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని జరుగుతున్న ప్రచారంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. తాను నగరి నుంచి పోటీ చేస్తానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. తనకు ఆ ఆలోచన లేదని స్పష్టం చేశారు.
బురద జల్లే ప్రయత్నం చేయొద్దంటున్న నారాయణ
రాజ్యసభ అవకాశం వస్తేనే తాను తీసుకోకుండా అజీజ్ పాషాకు ఇచ్చానని నారాయణ తెలిపారు. తనకు పదవీ కాంక్ష లేదన్నారు. బురద జల్లే ప్రయత్నం చేయొద్దని వ్యాఖ్యానించారు. కాగా, నగరి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆర్కే రోజా ప్రాతినిథ్యం వహిస్తున్న వహిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఏపీ సర్కారుపై నారాయణ విమర్శలు చేశారు. ఏపీలో మైనింగ్ మాఫియా రాజ్యమేలుతోందని ఆరోపించారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును కొట్టి తిరిగి ఆయనపైనే కేసు పెట్టారని నారాయణ ఆరోపించారు.
టీఆర్ఎస్ ఓ అద్దె ఇల్లు..
ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితులపై కేంద్రం జోక్యం చేసుకోవాలని నారాయణ డిమాండ్ చేశారు. తెలంగాణలో దళితబంధు పథకాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. దళితబంధును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కేబినెట్లో ఐదుగురు తప్ప మిగిలినవారంతా సమైక్యవాదులేనని నారాయణ చెప్పారు. టీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు అద్దె ఇల్లులా మారిందని ఎద్దేవా చేశారు.
పెగాసస్ వ్యవహారంపై విచారణకు నారాయణ డిమాండ్
ఇక కేంద్రంపైనా విమర్శలు గుప్పించారు నారాయణ. పెగాసస్ వ్యవహారం తమ ప్రభుత్వంను అస్థిరపరిచేందుకు అంతర్జాతీయ కుట్ర అంటున్న మోడీ ప్రభుత్వం విచారణకు ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Recommended Video
నగరి నియోజకవర్గంపై నారాయణ ఫోకస్ వల్లే..
కాగా, గత కొంత కాలంగా నగరి నియోజకవర్గంలో తరచూ పర్యటిస్తున్నారు నారాయణ. స్థానిక ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు నగరి, తిరుపతి, చిత్తూరు కేంద్రంగా ఆందోళనకా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఉన్న ఓ ఫ్యాక్టరీని తెరిపించాలని ఆందోళనలు చేస్తున్నారు. నగరి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న నేపథ్యంలో నారాయణ ఇక్కడ్నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే, దీనిపై నారాయణ క్లారిటీ ఇవ్వడంతో ఆ ప్రచారమంతా ఉత్తదేనని తేలిపోయింది. కాగా, 1999లో తిరుపతి అసెంబ్లీకి, తిరుపతి మున్సిపాలిటీ ఛైర్మన్ పదవికి పోటీ చేశారాయన. అయితే, ప్రతికూల ఫలితాలే వచ్చాయి. 2014 ఎన్నికల్లో తెలంగాణలోని ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.