శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శనం, వసతి గదులు, సేవా టికెట్ల షెడ్యూల్ విడుదల
Tirumala: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. వేలాదిమంది స్వామివారిని దర్శించుకుంటోన్నారు. తమ మొక్కులను చెల్లించుకుంటోన్నారు. మంగళవారం నాడు 60,110 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 21,445 మంది తలనీలాలను సమర్పించారు.
హుండీ ద్వారా 4.43 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పట్టింది. అయిదు కంపార్ట్మెంట్లల్లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వేసవి సెలవుల్లో భక్తుల సంఖ్య మరింత పెరుగుతుందని టీటీడీ అంచనా వేస్తోంది.

ఈ ఏడాది జూన్ నెలకు సంబంధించి శ్రీవారి 300 రూపాయల ప్రత్యేక దర్శనం, ఆర్జితసేవా టికెట్లు, శ్రీవారి సేవ కోటా, వసతి గదుల టికెట్ల విడుదల తేదీలను టీటీడీ అధికారులు ప్రకటించారు. ఈ నెల 18వ తేదీ నుంచి మార్చి 27వ తేదీ వరకు దశలవారీగా ఒక్కో సేవ టికెట్లను ఆన్లైన్లో పొందుపరుస్తారు.
ఈ నెల 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ కోసం భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. మార్చి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు ఆ సొమ్మును చెల్లించి టికెట్లను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
21వ తేదీన ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవలు కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను విడుదల చేస్తారు. జూన్ 19 నుంచి 21వ తేదీ వరకు జరుగనున్న జ్యేష్టాభిషేకం ఉత్సవంలో పాల్గొనడానికి అవసరమైన టికెట్లను ఈ నెల 21వ తేదీన ఉదయం 10 గంటలకు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు.
21వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు, దర్శన టికెట్ల కోటా విడుదల కానున్నాయి. 23వ తేదీన ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు అందుబాటులో ఉంటాయి.

23వ తేదీన ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం, గదుల కోటాను విడుదల చేస్తారు టీటీడీ అధికారులు. 23న మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శనం టికెట్ల కోటాను ఆన్లైన్లో పొందుపరుస్తారు. 25వ తేదీన ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక దర్శన టకెట్లను భక్తులకు అందుబాటులోకి వస్తాయి.
25వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను విడుదల చేస్తారు. తిరుమల, తిరుపతిల్లో వేర్వేరుగా అనేక రకాల వసతి గదులు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. తిరుపతి ప్రధాన బస్టాండ్ సమీపంలో శ్రీనివాసం, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణువాసం వసతి భవనాలు ఉన్నాయి. ఈ రెండు చోట్లా గదులను బుక్ చేసుకోవచ్చు.
తిరుమలలో శ్రీ పద్మావతి అతిథిగృహం, శ్రీ వేంకటేశ్వర అతిథిగృహం, రామ్ బగీచా వరాహస్వామి విశ్రాంతి భవనం, ట్రావెలర్స్ బంగ్లా, నారాయణగిరి గెస్ట్ హౌస్, నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత, సప్తగిరి వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఆన్ లైన్ ద్వారా గదులను బుక్ చేసుకునే సౌకర్యం ఉంది.
27వ తేదీన ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతిలోని శ్రీవారి సేవ కోటా, అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటా, మధ్యాహ్నం ఒంటిగంటకు పరకామణి సేవ కోటాను ఆన్లైన్లో అందుబాటులో వస్తాయి. https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా మాత్రమే శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications