శ్రీవారి లడ్డూ నాణ్యతపై రూమర్లు: తోసిపుచ్చిన పోటు ఉద్యోగులు
TTD Laddu Prasadam: తిరుమలలో శ్రీవారి అన్న ప్రసాదం, లడ్డూ నాణ్యతపై చెలరేగుతున్న దుష్ప్రచారానికి బ్రేకులు పడట్లేదు. శ్రీవారి అన్నప్రసాదంలో నాణ్యత లోపించిందంటూ ఇదివరకు వచ్చిన వార్తలపై తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. భక్తులకు అత్యున్నత ప్రమాణాలతో అన్నప్రసాదాలను అందిస్తున్నామని, దీనిపై ఇప్పటివరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని అన్నారు.
తాజాగా శ్రీవారి లడ్డూ ప్రసాదం రుచిగా ఉండట్లేదని, పటికబెల్లం తింటోన్నట్లుగా ఉందంటూ వస్తోన్న వార్తలపై టీటీడీ పోటు, లడ్డూ తయారీ ఉద్యోగులు స్పందించారు. నాణ్యత విషయంలో రాజీ పడట్లేదని తేల్చి చెప్పారు. నాణ్యమైన పదార్థాలతో శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదాలు తయారు చేస్తున్నామని వివరించారు.

ఈ నెల 1వ తేదీన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో లడ్డూ నాణ్యతకు సంబంధించి పలువురు భక్తులు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటోన్నామని అన్నారు. తిరుమల శ్రీవారి ఆలయ పోటులో పనిచేస్తున్న శ్రీవైష్ణవ బ్రాహ్మణులు, టీటీడీ అధికారులు, పోటు సిబ్బందితో తిరుమల వైభవోత్సవ మండపంలో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా పోటులో పనిచేస్తున్న పలువురు శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు మాట్లాడుతూ తాము కొన్ని తరాలుగా పారంపర్యంగా లడ్డూ తయారీలో నైపుణ్యం సాధించామని, ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి, శనగపిండి, చక్కెర, ఎండు ద్రాక్ష, బాదం తదితర అన్ని దినుసులను దిట్టం ప్రకారం టీటీడీ అధికారులు అందిస్తున్నారని అన్నారు.
వీటిని వినియోగించి నాణ్యంగా లడ్డూ ప్రసాదం తయారు చేస్తున్నామని పోటు సిబ్బంది చెప్పారు. లడ్డూ నాణ్యత తగ్గే అవకాశమే లేదని స్పష్టం చేశారు. దీనిపై వస్తోన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు చాలినన్ని లడ్డూలను సకాలంలో తయారు చేస్తోన్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications