టీటీడీ సంచలన నిర్ణయం: 6రోజులపాటు శ్రీవారి దర్శనం నిలిపివేత, కారణమిదే!
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ధర్మకర్తల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 11వ తేదీ నుంచి 16 వరకు 6రోజుల పాటు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేసింది. ఆగస్టు 17 నుంచి శ్రీవారి దర్శనం యథావిధిగా జరగనుంది.
12ఏళ్ల కోసారి..
తిరుమలలో 12 ఏళ్లకోసారి నిర్వహించే మహాసంప్రోక్షణ కార్యక్రమంపై చర్చించేందుకు ఛైర్మన్ పుట్టా సుధాకర్యాదవ్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 11వ తేదీ ఉదయం నుంచి 16వ తేదీ సాయంత్రం 6 గంటలకు వరకు కొండపైకి భక్తుల రాకను నిలిపివేయనున్నారు.
ఆగమపండితుల సలహా మేరకు
మహా సంప్రోక్షణ జరపాలన్న ఆగమ పండితుల సలహా మేరకు ఆగస్టు 12 నుంచి 16 వరకు అష్టబంధన, బాలాలయ మహా సంప్రోక్షణ కార్యక్రమాలను తిరుమల కొండపై నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 11న మహా సంప్రోక్షణకు అంకురార్పణ జరగనుంది. ఆయా రోజుల్లో వైదిక కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉండడం.. భక్తులకు దర్శనం కల్పించేందుకు తక్కువగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
రెండ్రోజుల ముందు నుంచే
తిరుమల కొండపై 11వ తేదీ నుంచి వైదిక కార్యక్రమాలు జరపాల్సి ఉండడటంతో భక్తుల రాకను నిలిపివేయడం జరుగుతుంది. దీనిపై ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో సింఘాల్ వివరించారు. కాగా, ఇంతకు ముందు 2006లో మహా సంప్రోక్షణ నిర్వహించారు.
గతంలో భక్తుల సంఖ్య తక్కువగా..
గతంలో తిరుమలకు రోజూ 20 నుంచి 30 వేల మంది భక్తులు వచ్చేవారని, దీంతో పరిమితంగానైనా దర్శనానికి అనుమతిచ్చేవారమని ఈవో తెలిపారు. ప్రస్తుతం రోజూ తిరుమలకు వచ్చే వారి సంఖ్య లక్షకు పైగా చేరడంతో ఈ కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన వివరించారు.