తిరుచానూరు అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం.. ఆన్ లైన్ లో టికెట్లు
తిరుచానూరులో వేంచేసియున్న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించనున్నారు. ఈ వ్రతంలో నేరుగా పాల్గొనడానికి లేదంటే వర్చువల్ గా పాల్గొనడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అవకాశం కల్పించింది. ఆగస్టు 18వ తేదీన దీనికి సంబంధించిన టికెట్లను ఆన్ లైన్ లో జారీచేయనున్నారు.
అమ్మవారి ఆలయంలో ఈనెల 25వ తేదీన వరలక్ష్మీ వ్రతాన్ని వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. దేవాలయంలో ఉన్న ఆస్థాన మండపంలో ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 6.00 గంటలకు అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ మాఢవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.

వ్రతంలో పాల్గొనాలనుకునేవారు 18వ తేదీ ఉదయం 9.00 గంటలకు ఆన్ లైన్ లో 150 టికెట్లు జారీచేస్తారు. ఈనెల 24వ తేదీన ఉదయం 9.00 గంటలకు ఆలయం దగ్గర ఉన్న కుంకుమార్చన కౌంటర్ లో కరెంట్ బుకింగ్ ద్వారా మరో 150 టికెట్లు విక్రయిస్తారు. రూ.వెయ్యి చెల్లించి భక్తులు టికెట్ ను కొనుగోలు చేయవచ్చని అధికారులు తెలిపారు.
ఎస్వీబీసీ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వర్చువల్ గా పాల్గొనేందుకు వీలుగా 18వ తేదీ ఉదయం 9.00 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో టికెట్లు విడుదల చేయనుంది. టికెట్లు పొందినవారికి 26వ తేదీ నుంచి 90 రోజుల్లోపు అమ్మవారి దర్శనానికి అనుమతి మంజూరు చేస్తారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఈనెల 25వ తేదీన అమ్మవారికి అభిషేకం, వస్త్రాలంకరణ సేవ, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రేక్ దర్శనం, వేద ఆశీర్వచనం సేవలను రద్దు చేసినట్లు టీటీడీ వెల్లడించింది.












Click it and Unblock the Notifications