సర్వదర్శనం టోకెన్లపై టీటీడీ తాజా నిర్ణయం
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం నాడు 83,806 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 23,352 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.59 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో రెండు కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 6 నుంచి 8 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

కాగా- స్లాటెడ్ సర్వదర్వనం టోకన్ల జారీపై టీటీడీ అధికారులు తాజా సమాచారం ఇచ్చారు. ఈ నెల 23వ తేదీ నుంచి అంటే గురువారం నుంచి ఎస్ఎస్డీ టోకెన్లను ఏ రోజుకు ఆ రోజు జారీ చేయనున్నామని తెలిపారు. ఈ టోకెన్లను భక్తులు అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ వద్దనున్న విష్ణు నివాసం, బస్టాండ్ వద్దనున్న శ్రీనివాసం కౌంటర్లలో గతంలో మాదిరిగానే పొందవచ్చు.
నేటితో వైకుంఠ ద్వార దర్శనం నేపథ్యంలో సర్వదర్శనం టోకెన్ల కోటాను ఈ నెల 17వ తేదీ నాటికే పూర్తయిన విషయం తెలిసిందే. 20వ తేదీ నుంచి సర్వదర్శనం టోకెన్లను జారీ చేయట్లేదు టీటీడీ అధికారులు. అయినప్పటికీ- టోకెన్లు లేని భక్తులను 20వ తేదీ నుంచే క్యూలైన్లో శ్రీవారి దర్శనానికి అనుమతి ఇస్తారు.
టోకెన్లను జారీ చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేసినందు వల్ల అవి లేకపోయినప్పటికీ క్యూ లైన్ ద్వారా నేరుగా శ్రీవారిని దర్శించుకోవచ్చని వెల్లడించారు అప్పట్లో. ఇప్పుడు తాజాగా ఎస్ఎస్డీ టోకెన్లను జారీ చేయడాన్ని పునరుద్ధరించనున్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, శ్రీనివాసం కౌంటర్లలో ఇదివరకట్లాగే ఈ టోకెన్లను అందజేయనున్నారు.
23వ తేదీ నాడే అధ్యయనోత్సవాలు తిరుమలలో ముగియబోతోన్నాయి. కిందటి నెల 30వ తేదీన ఈ అధ్యయనోత్సవాలు ఆరంభమైన విషయం తెలిసిందే. 24వ తేదీన తిరుమల నంబి చెంతకు శ్రీ మలయప్పస్వామి వేంచేపు చేస్తారు. 25న సర్వ ఏకాదశి, 26న అన్నమయ్య భవనంలో గణతంత్ర దినోత్సవం, 27న మాస శివరాత్రి, 29వ తేదీన శ్రీ పురంధర దాస ఆరాధన మహోత్సవాలు జరుగనున్నాయి.












Click it and Unblock the Notifications