వ్యభిచార గృహాలకు మహిళల తరలింపు: ఇద్దరి అరెస్టు
విజయవాడ: మహిళలను వ్యభిచార గృహాలకు తరలించే ఇద్దరు వ్యక్తులను సోమవారం కృష్ణాజిల్లా గుడివాడలో అరెస్ట్ చేశారు. వ్యభిచార గృహం నుంచి తప్పించుకుని వచ్చిన నలుగురు బాధిత మహిళలు ఆదివారం రాత్రి గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ అంకినీడు ప్రసాద్ చెప్పారు. శేరీవేల్పూరుకు చెందిన కొదమల సుజాత, శేరీదింటకుర్రుకు చెందిన ఆటో డ్రైవర్ డెక్కా కిషోర్ గుడివాడ పరిసర ప్రాంతాల మహిళలు, యువతులకు మాయమాటలు చెప్పి మహారాష్ట్రలోని పూణే వ్యభిచార గృహానికి అమ్మే స్తున్నారన్నారు.
ఈ క్రమంలో నిందితులు బిళ్లపాడుకు చెందిన తల్లీకూతుళ్లను, గుడ్లవల్లేరుకు చెందిన అక్కచెల్లెళ్లను పూణెలోని వ్యభిచార గృహానికి తరలించారన్నారు. బాధితులు తప్పించుకుని ఆదివారం రాత్రి గుడివాడ చేరుకున్నారన్నారు. నిందితులు వారిని వెంబడించి బెదిరించడంతో బాధిత మహిళలు పోలీసులను ఆశ్రయించినట్టు డిఎస్పీ చెప్పారు.
గుడివాడ పట్టణ, పరిసర ప్రాంతాల్లోని నిరుపేద మహిళలకు సొమ్ము ఎర వేసి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మహారాష్ట్రలోని ఫూణే అమ్ముతూ వస్తున్నారు.

ఫూణేలో కొన్ని వ్యభిచార గృహాలకు సుమారు రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు యువతులను అమ్మేస్తున్నారు. గుడివాడ రూరల్ మండలం బిళ్లపాడుకు చెందిన తల్లీకూతుళ్లు గుడివాడలోని హోటల్లో పని చేసుకుని జీవిస్తుండగా వారిద్దరికి పూణేలోని హోటల్లో పనులు ఇప్పిస్తామని అక్కడ భారీగా డబ్బు వస్తుందని సుజాత, కిశోర్లు నమ్మబలికారు. వారి మాటలు నమ్మి వారిద్దరు పూణే వెళ్ళారు. వీరిని ఫూణేలో వ్యభిచార గృహం నిర్వహించే నిందితురాలు సుజాత అమ్మమ్మ ఓరికుంట మరియమ్మ వద్దకు చేర్చారు.
పని చేయాలంటే కష్టపడాలని వ్యభిచారం చేస్తే మీకు, మాకు ఇద్దరికి లాభం అని అలా కాకుండా పూణే నుంచి పారిపోవాలనే ప్రయత్నం చేస్తే మీ శవాలే వెళ్తాయని హెచ్చరించినట్టు వారు తెలిపారు. తాము ప్రాణ భయంతో వారికి లొంగిపోవాల్సి వచ్చిందని, రోజుకు ముగ్గురు నుంచి నలుగురు వచ్చి తమను చిత్రహింసలకు గురి చేసేవారని వివరించారు. దీంతో చిత్రహింసలు భరించలేక పథకం ప్రకారం తన కుమార్తెను ఇంటికి పంపించేశానని తర్వాత తాను కూడా పరారై వచ్చేశానని తల్లి రోదిస్తూ చెప్పింది.
ఇదిలా ఉండగా గుడ్లవల్లేరుకు చెందిన అక్కాచెల్లెళ్లకు కూడా మాయమాటలు చెప్పి పూణే వ్యభిచార గృహానికి తరలించారు. పని మనుషులకు, వంట పని చేసే వారికి హైదరాబాద్లో మంచి గిరాకీ ఉందని చెప్పడంతో అక్కచెల్లెళ్లు కూడా వారి వలలో చిక్కుకున్నారు. తమను హైదరాబాద్ కని చెప్పి మహారాష్ట్రలోని పూణేకు తరలించి బలవంతంగా రూ.30వేలకు, రూ.50వేలకు వ్యభిచార గృహాలకు అమ్మేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. అక్కాచెల్లెళ్లు కూడా పరారై గుడివాడ చేరుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్లో వారు ఫిర్యాదు చేశారు. దీంతో బిళ్లపాడుకు చెందిన తల్లీకూతుళ్ల కేసును తాలూకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుడ్లవల్లేరుకు చెందిన అక్కాచెల్లెళ్ల ఫిర్యాదును గుడ్లవల్లేరు స్టేషన్కు బదిలీ చేశారు.












Click it and Unblock the Notifications