పూరి -తిరుపతి రైల్లోంచి తోసివేత: ఇద్దరి దుర్మరణం
నెల్లూరు: పూరీనుంచి తిరుపతి వెళ్లే రైలులో ప్రయాణిస్తున్న ఇద్దరిని అదే రైల్లో ప్రయాణిస్తున్న గుర్తు తెలియని వ్యక్తి కిందకు తోసేయడంతో ఒకరు మృతి చెందారు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన ప్రయాణికుల ఆగ్రహించి, ఘటనకు పాల్పడిన వ్యక్తిని సైతం రైలునుంచి కిందకు తోసేయడంతో అతనూ సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలో చోటుచేసుకొంది.
రైల్వే పోలీసుల సమాచారం ప్రకారం - తెనాలి నివాసి ఎస్కె రెహమాన్ (38), అతని కుమారుడు సందానీబాషా అలియాస్ బాబు కార్పెంటర్ పని నిమిత్తం పొద్దుటూరు వెళ్లడానికి పూరి- తిరుపతి ఎక్స్ప్రెస్ రైలు తెనాలిలో ఎక్కారు. రైలు గూడూరు దాటి కొండాగుంట సమీపంలోకి వచ్చేసరికి అదే రైలులో ప్రయాణిస్తున్న గుర్తు తెలియని వ్యక్తి రెహమాన్, బాబులను నడుస్తున్న రైలునుంచి కిందకు తోసేశాడు. దీంతో రెహమాన్కు తీవ్ర గాయాలయ్యాయి.
ఘటనను చూసి ఆగ్రహించిన తోటి ప్రయాణికులు గుర్తు తెలియని వ్యక్తిని కూడా రైలు నుంచి కిందకు తోసేయడంతో అతను సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. గుర్తు తెలియని వ్యక్తి ఎందుకు వీరిద్దరిని రైలు నుంచి తోసేశాడన్నది తెలియ రాలేదు. ఘటనకు సంబంధించి ప్రయాణికులు 108 సమాచారం అందించటంతో, క్షతగాత్రులను గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు.
తీవ్రంగా గాయపడిన రెహమాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రెహమాన్ కుమారుడు బాబు తీవ్రంగా గాయపడటంతో, సంఘటనపై వాస్తవాలు చెప్పలేని స్థితిలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.