పంచాయతీ ఎన్నికల వేళ... తూర్పు గోదావరిలో కత్తులతో దాడులు,ప్రకాశంలో ఉద్రిక్తత..
తొలి విడత పంచాయతీ ఎన్నికల వేళ తూర్పు గోదావరి జిల్లాలోని చినజగ్గంపేటలో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. కత్తులతో దాడులకు పాల్పడటంతో ఒకరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.
Recommended Video

ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం పల్లెపాలెంలోనూ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికార పార్టీ కార్యకర్తలు,ప్రత్యర్థులకు మధ్య గొడవలతో గ్రామం అట్టుడికింది. సోమవారం(ఫిబ్రవరి 8) రాత్రి కొంతమంది వైసీపీ నేతలు గ్రామంలో హల్చల్ చేశారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. స్థానిక వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ప్రస్తుతం రాష్ట్రంలో తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మంగళవారం(ఫిబ్రవరి 9) ఉదయం 6.30 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కరోనా పేషెంట్లకు పీపీఈ కిట్లతో చివరి గంటలో ఓటు వేసేందుకు అవకాశం కల్పించనున్నారు.తొలి విడతలో విజయనగరం మినహా మిగిలిన 12 జిల్లాల పరిధిలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో తొలిసారిగా 'నోటా'ను అందుబాటులోకి తెచ్చారు. అయితే నోటా ఓట్లను లెక్కించబోమని అధికారులు ఇదివరకే వెల్లడించారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు జరగనుంది.
తొలివిడతలో మొత్తం 3,249 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ అయింది. అయితే ఇందులో 525 గ్రామాల్లో సర్పంచి ఎన్నిక ఏకగ్రీవమైంది. నెల్లూరు జిల్లా వెలిచెర్ల గ్రామంలో సర్పంచి పదవికి ఒక్క నామినేషన్ కూడా దాఖలవలేదు. ఈ నేపథ్యంలో మిగిలిన 2,723 చోట్ల సర్పంచ్, 20160 వార్డులకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ పర్యవేక్షణకి విజయవాడలో కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. సర్పంచ్ అభ్యర్థికి పింక్ బ్యాలెట్, వార్డు అభ్యర్థికి తెల్ల బ్యాలెట్ను కేటాయించారు. పోలింగ్ ముగిశాక సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. ఫలితాల వెల్లడి అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక ఉంటుంది.












Click it and Unblock the Notifications