జగన్కు మరో ఝలక్, భూమా ఆస్త్రం: సైకిలెక్కనున్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలు
కర్నూలు: కర్నూలు జిల్లాలో మరోసారి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. కర్నూలు జిల్లాలో మిగిలిన ఐదుగురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేల్లో ఇద్దరు తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధపడినట్లు ప్రచారం సాగుతోంది.
కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన రెడ్డిపై టిడిపి నాయకులు భారీ ఎత్తున ఒత్తిడి పెట్టారని, మరో వైపు నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్యతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు. ఎస్వీ మోహన రెడ్డి టిడిపిలో చేరడం ఖాయమైందని ప్రచారం సాగిస్తున్నారు.
అందువల్లనే కరవుపై వైసిపి ఇచ్చిన ఆందోళన పిలుపు కర్నూలు నగరంలో ప్రభావం చూపించలేదని అంటున్నారు. వీరిద్దరితో చర్చలు ఫలిస్తే ఈ నెల 7వ తేదీన జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేర్చుకోవాలని టిడిపి నేతలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

ఎస్వీ మోహన రెడ్డిని ఒప్పించడానికి నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ద్వారా ఒత్తిడి తీసుకువస్తున్నారని సమాచారం. పార్టీ మార్పుపై ఆలోచనలో ఉన్న ఎస్వీ మోహన రెడ్డి వైకాపా ఇచ్చిన ఆందోళన పిలుపుపై దృష్టి సారించలేకపోయారన్న చర్చ సాగుతోంది. ఐజయ్య చేరికకు సంబంధించి టిడిపి, వైకాపాకు చెందిన నాయకులతో పాటు ఇతర మార్గాల ద్వారా కూడా సంప్రదింపులు జరుగుతున్నాయని తెలుస్తోంది.
ఫలితంగా కర్నూలులో వైసిపి చేపట్టిన ఆందోళన కార్యక్రమం ప్రభావం పెద్దగా ప్రభావం చూపలేదు. వైసిపి నుంచి అధికార పార్టీలోకి ఫిరాయించిన నంద్యాల, ఆళ్లగడ్డ, కోడుమూరు, శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యేల స్థానంలో పార్టీకి ఇన్చార్జిలు కూడా లేకపోవడంతో ఆ నియోజకవర్గాల్లో ఎక్కడా ఆందోళన ఛాయలు కనిపించలేదు.
ఇదిలావుంటే, పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారాలు ఉహగానాలేనని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు కరవు పీడిత ప్రాంత మండల కేంద్రాల్లో మాత్రమే ఆందోళనలు నిర్వహించాల్సి ఉందని ఆయన తెలిపారు. కర్నూలు నగరం కరవుపీడత ప్రాంతంలోకి రాదు కాబట్టే ధర్నా చేయలేదని వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications