సీఎం జగన్ కు మాజీ ఎంపీ ఉండవల్లి కీలక సూచన..!!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక సూచన చేసారు. పోరాటం చేసి జగన్ ముఖ్యమంత్రి అయ్యారని ఉండవల్లి వ్యాఖ్యానించారు. కానీ, ఇప్పుడు జగన్ పోరాటం చేస్తారని ప్రజల్లో నమ్మకం పోయే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. విభజన గురించి వదిలేయండని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని చెప్పారు. ఎవరి ప్రయోజనాల కోసం ఈ రకంగా నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఏపీ ప్రయోజనాల కోసం సీఎం జగన్ పోరాటం చేయాలని ఉండవల్లి సూచించారు.
ఏపీకి అన్యాయం జరుగుతున్నా నాడు చంద్రబాబు పోరాటం చేయని కారణంగానే 23 సీట్లకు పరిమితం అయ్యారంటూ ఉండవల్లి చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీతో సీఎం జగన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని..కానీ, ఏపీ ప్రయోజనాల విషయంలో రాజీ పడకూడదని ఉండవల్లి ముఖ్యమంత్రిని కోరారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 22న రాష్ట్ర విభజన పైన సుప్రీంకోర్టులో తుది విచారణ జరగనుందని చెప్పారు. ఆ సమాయానికైనా రాష్ట్ర ప్రభుత్వం జరిగిన అన్యాయం వివరిస్తూ కోర్టులో అఫిడవిట్ వేయాలని సూచించారు. ఏపీ విభజన బిల్లు ఆమోదించే సమయంలో లోక్ సభలో ప్రత్యక్ష ప్రసారం ఆపేసారని..రాజ్యసభలో ఓటింగ్ లేకుండానే బిల్లు ఆమోదించారని ఉండవల్లి గుర్తు చేసారు. నాడు రిస్కు తీసుకోవటం ఇష్టం లేకనే డివిజన్ చేశామంటూ వెంకయ్య చెప్పారని ఉండవల్లి వెల్లడించారు.
2012, జనవరి 30న ఏం జరిగిందో తన వద్ద పూర్తి సమాచారం ఉందన్నారు. రాజ్యాంగంలోని 100వ ఆర్టికల్ ను పక్కకునెట్టి రాష్ట్ర విభజన చేసారని వివరించారు. ఇంత కాల పోరాటం తరువాత ఏకపక్షంగా జరిగిన రాష్ట్ర విభజన పై కోర్టులో మాట్లాడే అవకాశం వచ్చిందన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు కేంద్రం ఇప్పటి వరకు కౌంటర్ వేయలేదని చెప్పారు. ఫిబ్రవరి కేసు విచారించాలా లేదా అనే అంశం మీద ముందుగా ప్రభుత్వం కౌంటర్ వేయాలని ధర్మాసనం సూచించిందని ఉండవల్లి వివరించారు. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం వదిలేయమంటూ అఫిడవిట్ వేయటం పైన ఉండవల్లి ప్రశ్నించారు. విభజన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదని చెప్పారు. విభజన అంశాల పైన సీఎం జగన్ ముందుకు రావాలని ఉండవల్లి అరుణ్ కుమార్ సూచించారు.