నిరుద్యోగ భృతి: డిగ్రీ పూర్తి చేసినవారికే!, ఇవీ విధివిధానాలు..
అమరావతి: నిరుద్యోగ భృతి విధివిధానాలకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు తీసుకుంది. గురువారం సచివాలయంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులనే నిరుద్యోగ భృతికి అర్హులుగా పరిగణించాలని నిర్ణయం తీసుకుంది. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ నిరుద్యోగ భృతి అందించేలా విధివిధానాలు ఖరారు చేసే పనిలో ఉన్నట్టు సమాచారం. జూన్ నుంచి ఈ పథకం అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.
కాగా, డిగ్రీ తర్వాత ఉన్నత విద్యను అభ్యసిస్తున్నవారిని నిరుద్యోగ భృతికి అనర్హులుగా పరిగణించాలని నిర్ణయించింది. ఐటీఐ, పాలిటెక్నిక్ కోర్సులు పూర్తి చేసినవారికి నిరుద్యోగ భృతికి బదులు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇప్పించి ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది.
డిగ్రీ పూర్తి చేసి ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు పోస్టులతోపాటు ప్రైవేట్ పరిశ్రమల్లో పనిచేస్తున్నవారిని నిరుద్యోగ భృతికి అనర్హులుగా పరిగణించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. అర్హులైన నిరుద్యోగుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకు మంత్రులు ఆదేశాలు జారీ చేశారు.
మొత్తం ప్రక్రియకు సంబంధించి జిల్లా కేంద్రంగా ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని, అధికారి పర్యవేక్షణలోనే ఇదంతా జరగాలని పేర్కొన్నారు.
10లక్షల మందికి నిరుద్యోగ భృతి:
రాష్ట్రవ్యాప్తంగా 10లక్షల మంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు వివరించారు. అదనంగా దరఖాస్తులు వస్తే, వారికి వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేసి, ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించారు.
నిరుద్యోగ భృతి అందుకునే యువతకు పలు రంగాల్లో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కనిపించాలని భావిస్తున్నారు. అలా ఉద్యోగాలు పొందినవారిని నిరుద్యోగ భృతి పథకం నుంచి తొలగించి, కొత్తవారికి అవకాశం కల్పించాలని అనుకుంటున్నారు.