TDPకి, BJPకి మధ్యవర్తిగా కేంద్ర మంత్రి?
తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతాపార్టీ మధ్య ఉప్పు నిప్పు అనే పరిస్థితి ఉంది. కేంద్రంలోని నేతలకన్నా రాష్ట్రంలోని నేతలే ఎక్కువగా టీడీపీని వ్యతిరేకిస్తున్నట్లు వారి ప్రకటనలను బట్టి ప్రజలకు స్పష్టమవుతోంది. రాబోయే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ఉన్న చంద్రబాబుకు అటువంటి అవకాశం ఇవ్వకుండా ఇక్కడి నేతలే మోకాలడ్డుతున్నారంటూ తెలుగుదేశం పార్టీ వర్గాలు మండిపడుతున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య ఈ తరహా వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఒక కేంద్ర మంత్రి చొరవ తీసుకున్నారు. ఇరుపార్టీలను ఒకే వేదికపైకి రప్పించారు.

టీడీపీ నేతలను కూడా కలవాలంటూ గట్టిగా చెప్పిన అమిత్ షా
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఏపీ పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలను కలిసే షెడ్యూల్ లేకపోయినప్పటికీ సదరు కేంద్ర మంత్రి చొరవ తీసుకొని ఏర్పాట్లు చేశారు. ఈ విషయం చివరి వరకు వైసీపీకి కూడా తెలవదు. టీడీపీ నేతలను కూడా కలవాలంటూ అమిత్ షా ఢిల్లీ నుంచి గట్టిగా చెప్పడంతో షెడ్యూల్ ఖరారైంది. రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ ఓట్ల శాతం తక్కువైనప్పటికీ మర్యాదపూర్వకంగా ముర్ము కలిసి టీడీపీ మద్దతు కోరారు.

అడ్డంకులు సృష్టించకుండా ఉంటే చాలు
పొత్తు లేకపోయినప్పటికీ ఎన్నికల్లో తనకు అడ్డంకులు సృష్టించకుండా ఉంటే చాలనేది చంద్రబాబు భావన. బీజేపీ తటస్థంగా ఉంటుందా? లేదంటే జగన్ కు లోపాయికారీగా ఏదైనా సహకారం అందిస్తుందా? అనే చిక్కుముడి ఇప్పటికీ వీడటంలేదు. బీజేపీ తన రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వ్యవహరిస్తుంది. కానీ చంద్రబాబు తనతో పొత్తు లేకపోయినా పర్వాలేదు.. అడ్డంకులు మాత్రం సృష్టించవద్దు అని సదరు కేంద్ర మంత్రిని కోరుతున్నారు. ఆయనద్వారా కేంద్రం తనకు వ్యతిరేకంగా లేకుండా చూడాలని బాబు ప్రయత్నిస్తున్నారు.

ప్రస్తుతానికి మౌనం వహిస్తున్న అధిష్టానం
గతంలో చంద్రబాబునాయుడిద్వారా లబ్ధిపొందిన సదరు కేంద్ర మంత్రి బీజేపీ టీడీపీతో కలిసివెళ్లడమే మేలనే విషయాన్ని ఇప్పటికే అధిష్టానానికి చేరవేశారు. ఈ ఏడాదిలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ఉండటంతో వాటిపై దృష్టి సారించిన బీజేపీ పెద్దలు ప్రస్తుతానికి ఔనానికానీ, కాదనికానీ సమాధానమివ్వలేదని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు కేంద్రంలో అవసరమైన సందర్భంలో వైసీపీ ఎన్డీయేకి మద్దతు తెలుపుతూ స్నేహహస్తాన్ని అందిస్తోంది. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తున్న నేపథ్యంలో బీజేపీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది.












Click it and Unblock the Notifications