తుని విధ్వంసం: 'భూమనా!ఆ డొంక లాగితే లోటస్పాండ్ కదులుతుంది'
అమరావతి: కాపు గర్జన సమయంలో జరిగిన తుని విధ్వంసం పైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య బుధవారం నాడు స్పందించారు. తునిలో వాడిన డ్రోన్ల డొంక లాగితే లోటస్ పాండు కదులుతుందని ధ్వజమెత్తారు.
డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. చిత్తూరు జిల్లాలోని తిరుపతి నుంచి తునికి జనాన్ని తరలించినమాట వాస్తవం కాదా చెప్పాలని భూమనను వర్ల రామయ్య ప్రశ్నించారు.
కాగా, మంగళవారం నాడు సీబీఐ విచారణ అనంతరం భూమన కరుణాకర్ రెడ్డి చంద్రబాబు పైన విరుచుకుపడిన విషయం తెలిసిందే. 1984లో నాదెండ్ల భాస్కర రావు టిడిపిను చీల్చినప్పుడు జరిగిన విధ్వంసానికి చంద్రబాబు కారణమని, గ్యాంగ్ స్టర్ నయీంను పెంచి పోషించింది అతనే అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే, సిఐడి మానసికంగా వేధించిందా అంటే, తనను వేధించే దమ్ము ఎవరికీ లేదన్నారు.
కాపుల మధ్య చిచ్చుపెట్టే యత్నం
మంజునాథ్ కమిషన్ కాపులు, బీసీలను వేర్వేరుగా పిలిచి మాట్లాడాలని గుంటూరు జిల్లా కాపు జేఏసీ డిమాండ్ చేసింది. కాపులు, బీసీల మధ్య చిచ్చుపెట్టేలా ప్రభుత్వం, మంజునాథ కమిషన్ వ్యవహరిస్తోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. స్మార్ట్ సర్వేలో కాపులను లెక్కించకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు.