భర్త కావాలి, ప్రాణహాని ఉంది: మాజీ ఎమ్మెల్యే కోడలు ఆవేదన
కడప: తన భర్తను తనకు దూరం చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యే, బిజెపి నేత కందుల శివానందరెడ్డి కోడలు, చంద్రఓబుల్ రెడ్డి భార్య వాసంతి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కడప సీపీఎం కార్యాలయంలో ఆమె గురువారం మహిళా సంఘాల నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆమెకు మహిళా సంఘాలు కూడా అండగా నిలిచాయి.
కందుల శివానందరెడ్డి కొడుకు చంద్రఓబుల్రెడ్డి తనను 2015లో ప్రేమ వివాహం చేసుకున్నట్లు వాసంతి రెడ్డి తెలిపారు. ఆ సందర్భంగా 'నా భార్యతో గొడవ పడ్డాను, విడాకులు తీసుకుంటున్నాను' అని చెప్పి తనను పెళ్లి చేసుకున్నారని బాధితురాలు తెలిపారు.

పెళ్లయిన ఆరు నెలల వరకు తనను ఇంటికి తీసుకెళ్లలేదన్నారు. ఎందుకు ఇంటికి తీసుకెళ్లడం లేదని ప్రశ్నిస్తే అప్పుడు అతని నిజరూపం బయటపడిందన్నారు. అప్పటి నుంచి తన నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని వాపోయారు.
పెద్ద మనుషులు పంచాయితీ చేసినా ప్రయోజనం లేకపోయిందని తెలిపారు. 'నెల రోజుల క్రితం మా అమ్మ కందుల శివానందరెడ్డి ఇంటికి వెళ్తే వారు.. డబ్బు ఇస్తాం, వేరే పెళ్లి చేసుకోమని చెప్పారు. మరోదారిలేక బుధవారం నేనే వారింటికి వెళ్లాను' అని ఆమె చెప్పారు.
ఆ సమయంలో చంద్రఓబుల్రెడ్డిని ఎక్కడో దాచి లేరని అబద్దం చెప్పారని వాపోయారు. పోలీసులొచ్చి తనను అక్కడి నుంచి పోలీసుస్టేషన్కు తీసుకెళ్లారని చెప్పారు. ఇప్పటికీ తన సెల్ఫోన్కి సందేశాలు పంపుతూ భయపెడుతున్నట్లు ఆమె తెలిపారు.
తనకు జరుగుతున్న అన్యాయంపై పోలీస్స్టేషనలో ఫిర్యాదు చేశానని తెలిపారు.
చంద్ర ఓబుల్రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందన్నారు. 'నాకు న్యాయం చేయండి. నా భర్త కావాలి. ఆస్తులు అవసరం లేదు. జీవితాంతం అతడితోనే కలిసి జీవిస్తా. ఇందుకోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం చేస్తా' అని వాసంతి రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు.












Click it and Unblock the Notifications