అర్థరాత్రి ప్రమాదం: బావిలోకి దూసుకెళ్లిన వాహనం, మహిళ సహా డ్రైవర్ మృతి
తిరుపతికి సమీపంలో ఓ వాహనం బావిలో పడడంతో తమిళనాడుకు చెందిన ఓ మహిళతో పాటు వాహనం డ్రైవర్ మరణించాడు.
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి ఎమ్మార్పల్లె సమీపంలో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ సహా వాహనం డ్రైవర్ మరణించారు. టవేరా వాహనం అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. దాదాపు 150 మీటర్ల మేరకు రోడ్డు పక్కకు వెళ్లింది. ఆ తర్వాత ఓ వ్యవసాయ బావిలో పడిపోయింది. దాదాపు 75 అడుగుల లోతులో వాహనం చిక్కుకుంది.
తమిళనాడు రాష్ట్రాంలోని తిరవణ్నామలై జిల్లా చెంగం గ్రామానికి చెందిన షణ్ముగం, విజయ్, సరసు, సుకన్య, షకీలలతో పాటు డ్రైవర్ తిరుమల శ్రీవారి దర్శనానికి గురువారంనాడు వచ్చారు. శుక్రవారంనాడు తిరుపతి గోవింద రాజ స్వామి ఆలయాన్ని సందర్శించుకున్నారు..
ఆ తర్వాత స్వగ్రామానికి వెనుదిరిగారు. ఈ క్రమంలో తిరుపతి ఎమ్మార్పల్లె పోలీసు స్టేషన్ పరిధిలోని పెరుమాళ్లపల్లె పంచాయతీ ఆంజనేయస్వామి గుడి ఎదురుగా వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో డ్రైవర్తో పాటు సుకన్య అనే మహిళ మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికుల సహాయంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది క్షతగాత్రులను బావిలో నుంచి రక్షించి రుయా ఆస్పత్రికి తరలించారు. టవేరా వాహనం బావిలో పడడంతో భారీ శబ్దం వచ్చింది. దీంతో స్థానికులు ప్రమాదాన్ని గుర్తించి 108కి, పోలీసులకు సమాచారం అందించారు.