వైసిపి తరుపున రాజ్య సభకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామినేషన్
అమరావతి: వైసీపీ రాజ్యసభ అభ్యర్ధిగా నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె. సత్యనారాయణకు వేమిరెడ్డి మూడు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు.
నామినేషన్ దాఖలు సమయంలో ఆయన వెంట వైసీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులున్నారు. కాగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అనుబంధంగా ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేశారు.
నామినేషన్ దాఖలు అనంతరం వేమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..." వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాకు అత్యంత గౌరవాన్ని ఇచ్చారు. 40 ఏళ్లుగా వైఎస్ఆర్ కుటుంబంతో నాకు అనుబంధం ఉంది. రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ కచ్చితంగా గెలుస్తుంది. ఏ పార్టీ వాళ్లు అయినా వైఎస్ జగన్ చేస్తున్న ప్రజాసంకల్పయాత్రను చూస్తే ఆయన ఎంత గొప్ప నాయకుడో తెలుస్తుంది. దురదృష్టవశాత్తు వైఎస్ఆర్ చనిపోయారు. కానీ ఈ రాష్ట్రానికి మంచి నాయకుడిని అందించారు. ఎన్నికష్టాలు ఎదురైనా జగన్ ప్రజల కోసం ధృడంగా నిలబడ్డారు. 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారు."...అని చెప్పారు.